నీటి లభ్యతను బట్టే పంటల ఎంపిక ఉండాలి
మంత్రి తుమ్మల
ఖమ్మం,జూలై 20: ఎల్నినో ప్రభావంతో ఏర్పడనున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి గ్రామంలో వర్షపాతం, నీటి వనరుల లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
నీటి లభ్యత మేరకే సాగు
నీటి లభ్యతను బట్టి మాత్రమే రైతులు పంటలు ఎంపిక చేసుకునేలా రైతు వేదికల ద్వారా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి తుమ్మల సూచించారు. ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహించి, వాస్తవ పరిస్థితులను స్పష్టంగా వివరించాలని, అధికారులు మౌనంగా ఉండకుండా సమర్థవంతమైన సమాచార ప్రసార విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. నీటి లభ్యత లేకున్నా వరి సాగు చేస్తే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, ముందుగానే స్పష్టమైన అవగాహన కల్పించకపోతే ప్రభుత్వంపై నిందలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
ఎల్నినో పరిస్థితులను అవకాశంగా మలుచుకుని ఆయిల్పామ్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ఆయిల్పామ్, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని తెలిపారు.
గోదావరి జలాల వినియోగంపై ఆదేశం
ప్రస్తుతం ఖరీఫ్లో సాగునీరు అందుబాటులో లేని పరిస్థితుల్లో, రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చో అన్ని సాంకేతిక అవకాశాలను పరిశీలించి తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి తుమ్మల సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా వైరా, లంకాసాగర్ జలాశయాలను ప్రస్తుతం తాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నట్టు, పాలేరు జలాశయంలో సెప్టెంబర్ 2026 వరకు మాత్రమే తాగునీటి నిల్వలు ఉన్నట్టు అధికారులు మంత్రికి వివరించారు.
సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో పాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్ దివాకర్ టీఎస్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.