దేవాలయాల దొంగతనాల ముఠా గుట్టురట్టు..
ముగ్గురు అరెస్టు
1 / 3
వియంబంజర,జూలై 20: ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠాను వియం బంజర పోలీసులు అరెస్టు చేశారు. షేక్ జానీ అలియాస్ జానీ షరీఫ్, పేరాల నరసింహారావు అలియాస్ బాబీ, అర్వ ఉదయ్ కుమార్లను నిందితులుగా గుర్తించిన పోలీసులు, వీరిపై Cr.No. 123/2026 (సెక్షన్లు 331(4), 305 బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేశారు. బుధవారం (19న) సాయంత్రం దొంగిలించిన వెండి, బంగారు వస్తువులను అమ్ముకునేందుకు కారు, మోటార్ సైకిల్పై తిరువూరు వెళ్తున్న నిందితులను సీతారామపురం గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. పంచుల సమక్షంలో విచారించి, వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
పాత నేరస్తులే..
అరెస్టైన ముగ్గురూ గతంలోనూ పలు నేరాల్లో పాల్గొన్న అలవాటు నేరస్తులేనని పోలీసులు తెలిపారు. షేక్ జానీ, అర్వ ఉదయ్ కుమార్లపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో దొమ్మీ (డెకాయిటీ) కేసు ఉంది. షేక్ జానీపై కొత్తగూడెం టూటౌన్, పాల్వంచ, ఇల్లందు పోలీస్ స్టేషన్ల పరిధిలో నివాస గృహాల దొంగతనం కేసులు నమోదయ్యాయి. పేరాల నరసింహారావుపై హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఐదు దొంగతనం కేసులతో పాటు, మూలకలపల్లి, నేలకొండపల్లి, గోకవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో దేవాలయ దొంగతనం కేసులు ఉన్నట్టు వెల్లడైంది.
వరుస దేవాలయాల్లో చోరీలు
గత నెల రోజులుగా నిందితులు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాల్లోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. జూన్ 27న కొత్తగూడెం హనుమాన్ బస్తీలోని హనుమాన్ ఆలయంలో బంగారు బొట్టును, జూన్ 28న పెనుబల్లి మండలం ఉప్పల్చెలక గ్రామంలోని అక్కమ్మ గుడి రామాలయం హుండీ నుంచి మూడు బంగారు సూత్రాలను చోరీ చేశారు. జూన్ 30న తల్లాడ మండలం అంజనాపురం, కల్లూరు మండలం గనియా తండా గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో వెండి కిరీటం, వెండి నేత్రాలు, వెండి తమలపాకుల హారం వంటి వస్తువులను ఎత్తుకెళ్లారు. జులై 6న వేంసూరు మండలం లింగపాలెం హరిహర క్షేత్ర దేవాలయంలో బంగారు సూత్రాలు, వెండి వస్తువులను, జులై 7 అర్ధరాత్రి ఏపీలోని గోకవరం గంగాలమ్మ గుడిలో బంగారు నేత్రాలు, సూత్రాలతో పాటు వెండి వస్తువులను, జులై 10న పెనుబల్లి మండలం బయన్నగూడెంలో వెండి కిరీటాన్ని చోరీ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
రూ. లక్షల విలువైన సొత్తు స్వాధీనం
నిందితుల వద్ద నుంచి మొత్తం 24 గ్రాముల బంగారం, 1.536 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నేరాలకు వినియోగించిన ఒక కారు, ఒక మోటార్ సైకిల్తో పాటు, తాళాలు పగలగొట్టేందుకు వాడిన ఇనుప రాడ్, సుత్తి, కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్లను కూడా పోలీసులు రికవరీ చేశారు.
ఆలయ కమిటీలకు పోలీసుల సూచన
ఇలాంటి దొంగతనాలు పునరావృతం కాకుండా నియోజకవర్గ పరిధిలోని దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా మండలాల్లోని ఆలయ కమిటీలకు వియం బంజర పోలీసులు సూచించారు.