క్షేత్రస్థాయి వాస్తవాలతోనే ఎల్నినోను ఎదుర్కోవాలి
డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం,జూలై 20: ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను శాస్త్రీయ అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు, శాఖల మధ్య సమన్వయంతోనే సమర్థంగా ఎదుర్కోవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో వర్షపాతం, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితి, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల ప్రణాళికలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్ దివాకర్ టీఎస్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
35 శాతం వర్షపాత లోటు
సమావేశంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ ఎల్నినో పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. జులై 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 35 శాతం వర్షపాత లోటు నమోదైందని, రైతులు ప్రస్తుతం పత్తిని అధికంగా సాగు చేశారని, వర్షాలు కురిస్తే వరి వేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం, రాబోయే రెండు నెలల్లో భూగర్భ జలాలు మరింత అడుగంటే అవకాశం ఉన్నందున ఏ రైతూ వరి సాగుకు వెళ్లొద్దని కోరారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను నేరుగా తెలుసుకునేందుకే ప్రభుత్వం జిల్లాల వారీగా ఇలాంటి సమీక్షలు చేపడుతోందని చెప్పారు.
సాగునీరు కష్టమే.. తాగునీటికే ప్రాధాన్యం
ఈ ఖరీఫ్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు వచ్చే పరిస్థితి లేదని, పాలేరు ఆయకట్టుకూ నీరు అందదని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. వాస్తవ పరిస్థితిని దాచకుండా అధికారులు నేరుగా రైతులతో మాట్లాడాలన్నారు. ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తాగునీటి అవసరాలకే అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడైనా కొరత ఏర్పడితే వెంటనే ప్రత్యామ్నాయ వనరులను గుర్తించి అందుబాటులోకి తేవాలని సూచించారు. ఏడాది కాలానికి సరిపడా తాగునీటి కార్యాచరణ ప్రణాళికను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని ఆదేశించారు.
నీటి లభ్యత మేరకే పంటలు
భూగర్భ జలాల లభ్యత ఆధారంగానే పంటల ప్రణాళిక ఉండాలని, నీటి అధిక అవసరమున్న వరి వంటి పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. పెసర, మినుములు, కందులు, అలసంద, చిరుధాన్యాల వంటి తక్కువ నీటి పంటలవైపు రైతులను మళ్లించాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున, బోర్ల ఆధారంగా వరి సాగు చేస్తే నష్టపోతారని హెచ్చరించారు. నీటి లభ్యత లేని పరిస్థితుల్లో వరి సాగు చేస్తే అది పూర్తిగా రైతుల సొంత బాధ్యతేనన్న సందేశం క్షేత్రస్థాయికి చేరాలని పేర్కొన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వర్షపాతం గణనీయంగా తగ్గిందని, ఇలాంటి తీవ్ర కరవు పరిస్థితులు దాదాపు 150 ఏళ్లకు ఒకసారి వస్తాయని నిపుణుల అభిప్రాయమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జలవిద్యుత్, థర్మల్ విద్యుదుత్పత్తిపైనా ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
గోదావరి జలాలపై కసరత్తు
రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా అవసరాలకు వినియోగించుకునే సాంకేతిక అవకాశాలపై సమగ్ర నివేదిక వెంటనే సమర్పించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. వైరా, లంకాసాగర్ జలాశయాలను ప్రస్తుతం తాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నామని, పాలేరు జలాశయంలో సెప్టెంబర్ 2026 వరకు మాత్రమే తాగునీటి నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గోదావరి బ్యాక్వాటర్ను ఎత్తిపోసి చెరువులు నింపేందుకు అవసరమైన మోటార్లు, విద్యుత్ సదుపాయాలపై ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం, మంత్రి, జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్ కలిసి తెలంగాణ జలసిరి, ఎల్నినో సూపర్ పరిస్థితిలో తీసుకోవాల్సిన చర్యలపై కరపత్రాలను ఆవిష్కరించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస రెడ్డి, సుడా చైర్పర్సన్ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.