ముడి పొగాకుపై జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలి
కేంద్రానికి ఏపీ బృందం వినతి
న్యూఢిల్లీ, జూలై 21: ముడి పొగాకు (హెచ్ఎస్ఎన్ 2401)పై విధిస్తున్న జీఎస్టీని 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఆంధ్రప్రదేశ్ బృందం కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఈ బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ బృందంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ పెంపు వల్ల ఎఫ్సీవీ (ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా) పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బృందం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. తాము కోరుతున్న పన్ను తగ్గింపు ముడి పొగాకుకు మాత్రమే వర్తిస్తుందని, తుది ఉత్పత్తులకు కాదని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలోని పొగాకు రైతులకు, ఎగుమతిదారులకు గణనీయమైన ఊరట లభిస్తుందని బృందం పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన పరిశీలన చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.