ఎమ్మెల్యే కృషికి ఫలితం పశువైద్యశాలలకు సొంత భవనాలు
రూ.1.25 కోట్లు మంజూరు
రైతన్న కష్టం తెలిసిన నేతలు అరుదు. అలాంటి కోవకు చెందిన నేత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. తన నియోజకవర్గంలో పాడి రైతులు, పశు పోషకులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఆయన గుర్తించారు. కిరాయి భవనాల్లో, శిథిలావస్థలో నడుస్తున్న పశు వైద్యశాలలను చూసి చలించిపోయారు. వెంటనే క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక సిద్ధం చేయించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన శ్రమ ఫలించింది. నియోజకవర్గంలోని నాలుగు పశు వైద్య సంస్థలకు నూతన భవనాలు మంజూరవడంతో మూగజీవాల సంరక్షణలో నూతన అధ్యాయం ఆరంభం కానుంది.
విన్నపం నుంచి ఉత్తర్వుల దాకా...
జూలై 9న ఎమ్మెల్యే సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పర్చూరు నియోజకవర్గంలో పశు వైద్య మౌలిక సదుపాయాల కొరతను వివరిస్తూ, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన పశు సంవర్ధక శాఖ, రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు నిధులు కేటాయించింది.
ఎక్కడెక్కడ ఎన్ని నిధులు...
పర్చూరు ఏరియా వెటర్నరీ హాస్పిటల్ - రూ.35 లక్షలు
మార్టూరు మండలం కొనంకి వెటర్నరీ డిస్పెన్సరీ - రూ.30 లక్షలు
యద్దనపూడి మండలం పునూరు వెటర్నరీ డిస్పెన్సరీ - రూ.30 లక్షలు
కారంచేడు వెటర్నరీ డిస్పెన్సరీ - రూ.30 లక్షలు
మొత్తం రూ.1.25 కోట్ల వ్యయంతో ఈ నాలుగు భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ లాప్స్ కాకుండా, పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, నెలవారీ పురోగతి నివేదికలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
రైతుల్లో ఆనందం
తరతరాలుగా వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్న పర్చూరు ప్రాంత రైతులకు ఈ నిర్ణయం వరంలా మారింది. సరైన వైద్య సదుపాయాలు లేక పశువులకు చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితికి ఇక తెరపడనుంది. సొంత భవనాలు అందుబాటులోకి వస్తే మెరుగైన సేవలు, అత్యవసర చికిత్సలు వేగంగా అందుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"పాడి రైతుల సంక్షేమమే నా ధ్యేయం: ఎమ్మెల్యే ఏలూరి
మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం దోహదపడుతుంది. భవిష్యత్తులోనూ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా" అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు.