*రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం*
ఎమ్మెల్యే ఏలూరి
కారంచేడు,జూన్ 16:రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువుల సరఫరాను ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చేపట్టిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. పంటలకు అవసరమైన మేరకే ఎరువులు వినియోగించాలని, అధిక మోతాదులో వాడటం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా భూమి సారవంతత దెబ్బతిని రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో హెచ్ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర పురుగు నియంత్రణ (ఐపీఎం) రైతు శిక్షణ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఈ మేరకు మాట్లాడారు.ప్రస్తుతం ఖరీఫ్ సాగు ఆశాజనకంగా సాగుతోందని, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేపట్టడం ద్వారా దిగుబడులు పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని రైతులకు సూచించారు. రైతులు ఎరువులు వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి సూచించారు.సదస్సులో ఏపీఎస్ఎస్సీఏ డైరెక్టర్ డా. వై. సతీష్, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల డీన్ డా. చెరుకూరి శ్రీనివాసరావు, ఏఆర్డీ ఎన్.వి.ఎస్.ఎస్. దుర్గాప్రసాద్ పాల్గొని సమగ్ర పురుగు నియంత్రణ, పర్యావరణహిత పంట సంరక్షణ, పురుగుమందుల సురక్షిత వినియోగం, డ్రోన్ సాంకేతికత, ఆధునిక వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.అత్యంత ప్రమాదకర పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని నిపుణులు సూచించారు. రైతుల ఆరోగ్య భద్రతతో పాటు నేల సారాన్ని కాపాడే వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేశారు.కార్యక్రమంలో ఏపీఎస్ఎస్సీఏ బోర్డు సభ్యుడు మాలేంపాటి సత్యనారాయణ, ఏపీఈవిడీసీ రాష్ట్ర డైరెక్టర్ టి. శ్రీహరి,రోడ్డు రవాణా సంస్థ డైరెక్టర్ కారుమంచి కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు,
ఏఎంసీ వైస్ చైర్మన్ చిరంజీవి, పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.