కాజ ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభించిన
మంత్రి నారా లోకేష్
1 / 2
మంగళగిరి,జూన్ 17: మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి, మెరుగైన పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో కాజ గ్రామంలో నిర్మించిన ఆధునిక కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి బుధవారం ప్రారంభించారు.ఉప్పలపాడు–నంబూరు–కాజ రహదారి మార్గంలో ఉన్న పార్క్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసానికి స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్క్ను ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటారు. పార్క్లోని వివిధ సౌకర్యాలను పరిశీలించిన మంత్రులు ప్రజలతో మమేకమయ్యారు.
రూ.3.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి
మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా సెల్కాన్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా రూ.3.3 కోట్ల వ్యయంతో ఈ పార్క్ను అభివృద్ధి చేసింది. 17.18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టూ ఆధునిక సౌకర్యాలతో పార్క్ను తీర్చిదిద్దారు.
పార్క్ అభివృద్ధిలో భాగంగా 1.7 కిలోమీటర్ల మేర చెరువు కట్టను బలోపేతం చేయడంతో పాటు, అదే పొడవున 3 మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. ట్రాక్ వెంట విద్యుత్ దీపాలు, భద్రత కోసం జీఐ చైన్ లింక్ మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
12,800 మొక్కలతో పచ్చదనం
పార్క్లో 42 రకాల జాతులకు చెందిన 12,800 మొక్కలను నాటారు. సందర్శకుల కోసం ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, ఆకర్షణీయమైన సుందరీకరణ పనులు చేపట్టి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు.
మంగళగిరి నియోజకవర్గాన్ని పర్యావరణ హిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, మంగళగిరి ఏఎంసీ ఛైర్మన్ జవ్వాది కిరణ్ చందు, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్యతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.