కనిగిరిలో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన మంత్రులు
ఆనం,గొట్టిపాటి, ఉగ్ర
1 / 2
కనిగిరి,జూన్17: పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కనిగిరి మున్సిపాలిటీలోని 11వ వార్డు దేవాంగనగర్లో నిర్మించిన నూతన అర్బన్ హెల్త్ సెంటర్ను జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర విద్యుత్ మరియు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం ప్రారంభించారు.
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) గ్రాంట్ కింద రూ.1.18 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు భవనంలోని వసతులను పరిశీలించారు. పట్టణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు మరింత చేరువయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా తల్లి-శిశు ఆరోగ్య సేవలు, సాధారణ వైద్య సేవలు, టీకాల కార్యక్రమాలు, వ్యాధి నిర్ధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఈ కేంద్రం కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.