ఖరీఫ్కు పకడ్బందీ ఏర్పాట్లు
సన్న రకాల వరికే ప్రాధాన్యం: మంత్రి తుమ్మల
1 / 2
హైదరాబాద్,జూన్ 17: ఖరీఫ్ సీజన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా సన్నాహాలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం బుధవారం సచివాలయంలో విత్తన కంపెనీల ప్రతినిధులు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కృషివాస్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశమై ఖరీఫ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఏడు వరి రకాలకే ప్రోత్సాహం...
రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాల వరి విత్తనాలను రైతులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని విత్తన కంపెనీలను మంత్రి ఆదేశించారు. ఈ రకాల వరికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వం సూచించిన ఈ ఏడు రకాల వరికే బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేసిన మంత్రి, విత్తనాల నిల్వలు, విక్రయాల వివరాలను రోజువారీగా నమోదు చేయాలని సూచించారు. విత్తన సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి...
ఖరీఫ్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని డీలర్లకు మంత్రి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యూరియా యాప్ ద్వారా సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువుల పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఈ విధానం వల్ల యూరియా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడిందన్నారు.పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎరువుల దిగుమతులపై ఒత్తిడి ఉన్నప్పటికీ రాష్ట్ర రైతులకు అవసరమైన ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. యాప్ పనితీరుపై డీలర్లు సంతృప్తి వ్యక్తం చేస్తూ, మండలాల వారీ మ్యాపింగ్, రవాణా వ్యయాల అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
శాటిలైట్ సాంకేతికతతో చీడపీడల గుర్తింపు...
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై కృషివాస్ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా పంటల్లో చీడపీడలు, వ్యాధులను ముందుగానే గుర్తించి రైతులకు సమాచారం అందించే విధంగా కృషివాస్ ప్రాజెక్టు పనిచేస్తోందని ప్రతినిధులు వివరించారు.
ఈ ప్రాజెక్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందిన రైతుతో మంత్రి ఫోన్లో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.ప్రపంచ స్థాయి సాంకేతికతను తెలంగాణ రైతులకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతుల ఉత్పాదకత పెంపు, ఖర్చుల తగ్గింపు, దిగుబడుల రక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశాల్లో వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.