త్యాగాలు బీఆర్ఎస్వి.. మోసాలు కాంగ్రెస్వి
మాజీ మంత్రి హరీశ్రావు
1 / 2
హుస్నాబాద్,జూన్ 17: తెలంగాణ కోసం త్యాగాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ అయితే, ప్రజలను మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ నాయకులు పదవులను త్యజించి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారని, అయితే రేవంత్రెడ్డి ఎలాంటి త్యాగం చేయకుండా రాజకీయ ప్రయోజనాలు పొందారని విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేశారని, ఇప్పుడు ఆ హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారని అన్నారు.
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
రైతుబంధు నిధులు 85 రోజులు దాటినా విడుదల కాలేదని, రైతుబీమా పథకం ఐదు నెలలుగా నిలిచిపోయిందని ఆరోపించారు. వడ్ల కొనుగోళ్లలో కోతలు విధిస్తున్నారని, బోనస్ విషయంలోనూ రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.
సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి
ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు ఖర్చు చేయడం లేదని హరీశ్రావు ఆరోపించారు. దళితబంధు, కులవృత్తుల అభివృద్ధి కార్యక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, చేనేత ప్రోత్సాహక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు.
గౌరవెల్లి ప్రాజెక్టుపై విమర్శలు
బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లే సమయంలో పార్టీ కార్యకర్తలు ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. బీఆర్ఎస్ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు తొలగింపుకు గురికాకుండా శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుంది
ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని హరీశ్రావు స్పష్టం చేశారు. రైతులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.