జూన్ 22న బసవతారకం ఆసుపత్రి రజతోత్సవాల ముగింపు సభ
సీఎంలు చంద్రబాబు, రేవంత్, నడ్డా సహా ప్రముఖుల హాజరు.. బాలకృష్ణ
1 / 2
హైదరాబాద్, జూన్ 10: బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన సంస్థ (BIACH&RI) రజతోత్సవాల ముగింపు సభను ఈ నెల 22న హైదరాబాద్లోని హైటెక్ సిటీ నొవాటెల్ హోటల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొనే ఈ కార్యక్రమం ఆసుపత్రి 25 ఏళ్ల సేవా ప్రస్థానానికి ప్రతీకగా నిలవనుందని పేర్కొన్నారు.
బుధవారం ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బాలకృష్ణ.. 2000 సంవత్సరంలో ప్రారంభమైన బసవతారకం ఆసుపత్రి, దివంగత నందమూరి తారక రామారావు, బసవతారకం ఆశయాలకు అనుగుణంగా నిరంతరం సేవలందిస్తూ 25 సంవత్సరాల మైలురాయిని చేరుకుందని చెప్పారు. గత ఏడాది కాలంగా రజతోత్సవాల సందర్భంగా పలు సేవా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ప్రముఖుల సమక్షంలో ముగింపు సభ...
రజతోత్సవాల ముగింపు కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు బాలకృష్ణ తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, తెలంగాణ ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు కూడా పాల్గొననున్నారని చెప్పారు.
భవిష్యత్ విస్తరణపై దృష్టి....
25 ఏళ్ల ప్రస్థానాన్ని సమీక్షించుకుంటూనే భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్లో ఆధునిక సదుపాయాలతో కూడిన ‘నార్త్ బ్లాక్’ నిర్మాణంతో పాటు, అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో నిర్మిస్తున్న కొత్త క్యాన్సర్ ఆసుపత్రిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ఈ సంస్థకు గత 25 ఏళ్లుగా సహకరించిన దాతలు, వైద్యులు, సిబ్బంది, సేవా సంస్థల సహకారం చిరస్మరణీయమని కొనియాడారు. వారి స్ఫూర్తితోనే సంస్థ మరింత విస్తృత సేవలు అందిస్తుందని చెప్పారు.
చిన్నారుల మధ్య పుట్టినరోజు వేడుకలు...
తన జన్మదినాన్ని పురస్కరించుకుని క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల మధ్య బాలకృష్ణ ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేసి చిన్నారులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం వారికి బొమ్మలు, బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు దాతలు ఆసుపత్రి అభివృద్ధి కోసం అందించిన విరాళాలను బాలకృష్ణ స్వీకరించారు. హైదరాబాద్కు చెందిన సీతారామరాజు రూ.లక్ష విరాళాన్ని అందించగా, త్రివేణి, కృష్ణవేణి విద్యాసంస్థల విద్యార్థులు క్యాన్సర్ రోగుల సహాయార్థం సేకరించిన రూ.1,01,116ను అందజేశారు. అలాగే అమరావతి తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి కోసం కాకర్ల రాఘవేంద్రరావు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.
విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా చిన్న వయసులోనే సేవాభావంతో ముందుకొచ్చిన విద్యార్థులను అభినందించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, ప్రజలు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
వైద్య బృందం...
కార్యక్రమంలో బసవతారకం ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డా. టి. సుబ్రహ్మణ్యేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్ డా. ఫణికోటేశ్వరరావు, అసోసియేట్ డైరెక్టర్ (అకడమిక్స్) డా. కల్పనా రఘునాథ్తో పాటు వైద్య విభాగాధిపతులు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
25 ఏళ్ల సేవా ప్రస్థానం...
క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఎన్టీఆర్ సంకల్పానికి రూపంగా ప్రారంభమైన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి.. గత పాతికేళ్లలో లక్షలాది మంది రోగులకు చికిత్స అందిస్తూ దేశంలోని ప్రముఖ క్యాన్సర్ వైద్య సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రజతోత్సవాల ముగింపు సభ ఆ సేవా ప్రస్థానానికి మరో మైలురాయిగా నిలవనుంది.