విత్తనాల బంతులతో పచ్చదనం పెంపొందిద్దాం:
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మూలపాడు (ఎన్టీఆర్ జిల్లా),జూన్ 5: రాష్ట్రంలో పచ్చదనాన్ని విస్తృతంగా పెంపొందించేందుకు విత్తనాల బంతుల (సీడ్ బాల్స్) తయారీ, పంపిణీ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా తన తల్లి అంజనా దేవి పేరుతో కొండపల్లి బొమ్మల తయారీలో వినియోగించే తెల్ల పొణికి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన "మా కే నామ్ ఏక్ పేడ్" పిలుపు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని ప్రజలకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా గత 20 రోజులుగా విత్తనాల బంతుల తయారీపై అటవీశాఖ అధికారులు, వన సంరక్షణ సమితి (వీఎస్ఎస్) సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నంను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజలు పెద్దఎత్తున విత్తనాల బంతులు తయారు చేసి వినియోగించాలని పిలుపునిచ్చారు.
వివిధ రకాల అటవీ, పర్యావరణానికి ఉపయోగపడే వృక్షాల విత్తనాలపై అధికారులతో, నిపుణులతో చర్చించిన పవన్ కళ్యాణ్ స్వయంగా విత్తనాల బంతులు తయారు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వెయ్యి అంకుడు మొక్కలను నాటించారు.
అలాగే డ్రోన్ల ద్వారా విత్తనాలు, విత్తనాల బంతులను అటవీ ప్రాంతాల్లో చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విధానం ద్వారా విస్తృత స్థాయిలో పచ్చదనం పెంపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) పీవీ చలపతిరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మల్లిఖార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశతో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.