రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం
ఏయూను నెట్ జీరో క్యాంపస్గా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబు
విశాఖపట్నం,జూన్ 5: రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పర్యావరణ సమతుల్యత రోజురోజుకూ దెబ్బతింటోందని, ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు తుఫానుల ప్రభావం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తన మద్దతు తెలిపారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏయూను నెట్ జీరో క్యాంపస్గా అభివృద్ధి చేయాలి
ఆంధ్ర యూనివర్శిటీ పచ్చదనం, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలవాలని సీఎం సూచించారు. తిరుమల తరహాలో ఏయూ క్యాంపస్లో కూడా గ్రీనరీని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం క్యాంపస్లో ఉన్న 25 శాతం గ్రీన్ కవర్ను 50 శాతానికి పెంచేలా చర్యలు చేపట్టాలని యూనివర్శిటీ వీసీకి ఆదేశించారు.
450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏయూ క్యాంపస్ను నెట్ జీరో క్యాంపస్గా తీర్చిదిద్దాలని, ఖాళీ ప్రదేశాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసి విద్యుత్ అవసరాలను సొంతంగా తీర్చుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే విద్యుత్ ఆదాలో మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు.
బయోడైవర్సిటీ పార్కుగా ఏయూ
క్యాంపస్ను బయోడైవర్సిటీ పార్కుగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. హాస్టళ్లు, కాలేజీల నుంచి వచ్చే చెత్త, చెట్ల ఆకులను కంపోస్ట్గా మార్చడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థను బలోపేతం చేయడం, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ను సమర్థవంతంగా అమలు చేసి, క్యాంపస్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు వెళ్లకుండా శుద్ధి చేసి తిరిగి వినియోగించాలని సూచించారు. పీఎన్జీ, ఎలక్ట్రిక్ స్టవ్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
పర్యావరణ విజ్ఞానానికి నాలెడ్జ్ హబ్గా ఏయూ
నెట్ జీరో విధానాల అమలుకు ప్రత్యేకంగా ప్రొఫెసర్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అధ్యయనాలకు ఏయూను నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల సరసన నిలిచేలా యూనివర్శిటీని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. క్యాంపస్లో ఎలక్ట్రిక్ సైకిళ్ల వినియోగాన్ని కూడా ప్రోత్సహించాలని సూచించారు.
విశాఖలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు
విశాఖపట్నంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పోర్టు ప్రాంతం నుంచి ప్రారంభించి అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడతామని సీఎం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక ట్రాక్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సైక్లింగ్ వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. మొక్కలు ఎక్కువగా పెంచిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం సైకిల్ సవారీ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర 3 టౌన్ పోలీస్ స్టేషన్ జంక్షన్, పోలమాంబ ఆలయం, వుడా పార్క్, వైఎంసీఏ, బీచ్ రోడ్ మీదుగా నోవోటెల్ వరకు సాగింది.
ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ సీఎం ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేశారు. మొత్తం 5.5 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 21 నిమిషాల్లో పూర్తి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.