వాస్తవాలు తెలుసుకోండి: నాగేశ్వరరావుపై
విష్ణువర్ధన్రెడ్డి కౌంటర్
వాస్తవాలను అంగీకరించడం రాజకీయ బానిసత్వం కాదు, రాజనీతి: బీజేపీ నేత
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కౌంటర్ ట్వీట్ చేశారు.
దేశంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలైన సంస్కరణలు కొందరికి నచ్చకపోవచ్చని, అయితే అందువల్ల వాస్తవాలు మారిపోవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి సహాయం చేసిన ప్రధానమంత్రిని వాస్తవాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. దీనిని ‘దిగజారడం’, ‘ఆత్మగౌరవం కోల్పోవడం’గా చిత్రీకరించడం సమంజసం కాదని విమర్శించారు.
వాస్తవాలను గుర్తించడం పరిణతికి నిదర్శనం
వాస్తవాలను అంగీకరించడం రాజకీయ బానిసత్వం కాదని, చేసిన మేలును గుర్తించడం ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనమని విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాస్తవాలను పరిశీలించాలని సూచించారు.
మోదీ సంస్కరణలను ప్రస్తావించిన నేత
ప్రధాని మోదీ నాయకత్వంలో అమలైన పలు కీలక సంస్కరణలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానంగా జీఎస్టీ అమలు, యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల విప్లవం, ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ-కాశ్మీర్లో కొత్త అభివృద్ధి అవకాశాలు, దివాలా, దివాళా పరిష్కార చట్టం (ఐబీసీ) ద్వారా ఆర్థిక క్రమశిక్షణ, జన్ ధన్-ఆధార్-మొబైల్ (జామ్), ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేస్తూ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేయడం వంటివి దేశాభివృద్ధికి మైలురాళ్లుగా నిలిచాయని పేర్కొన్నారు.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాయని విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. రాజకీయ విభేదాల కంటే వాస్తవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.