మోదీ ప్రశంసలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం
చంద్రబాబు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సాధారణంగా ఎవరికీ అంతత్వరగా కితాబు ఇవ్వని ప్రధాని మోదీ చంద్రబాబును ఉద్దేశించి ప్రశంసలు కురిపించడం గమనార్హం.
ప్రధాని పోస్టుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి రిప్లై ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రశంసలు
భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఈ సందర్భంగా ఏపీలో త్వరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు.సెమీకండక్టర్, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు, పూర్తయిన పలు జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు.
కార్యక్రమంలో వేదికపై ఉన్న సందర్భంగా ప్రధాని మోదీ నేరుగా చంద్రబాబుతో ప్రశంసాపూర్వకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర ప్రాంత చారిత్రక అంశాలను వీడియో వాల్ ద్వారా ప్రధానికి సీఎం స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా పొందూరు ఖాదీ శాలువా, బొబ్బిలి వీణ వంటి స్థానిక కళాఖండాలతో ప్రధానిని సత్కరించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి టేకాఫ్: సీఎం
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి టేకాఫ్ కానుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రధాని రాక కోసం ఉత్తరాంధ్ర సర్వసన్నద్ధంగా ఉందని, మోదీ నేతృత్వంలో రాష్ట్రానికి కొత్త అభివృద్ధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.