ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలలో
సీఎం రేవంత్
1 / 2
హైదరాబాద్, ఆగస్టు 2:సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికార నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన బోనాల విందుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలు భక్తి, ఆతిథ్యానికి వేదికగా నిలిచాయి.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికార నివాసంలో సంప్రదాయబద్ధంగా బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఏర్పాటు చేసిన బోనాల విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంప్రదాయ వంటకాలతో ఆతిథ్యం
అతిథులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆప్యాయంగా ఆహ్వానించి, తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అతిథులతో స్నేహపూర్వకంగా ముచ్చటిస్తూ స్వయంగా ఆతిథ్యం అందించారు.
కుటుంబ సభ్యులతో సీఎం ఆత్మీయ పలకరింపు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లి మల్లమ్మ, సతీమణి మంజుల, కుమారులు పృథ్వీ, ప్రణవ్తో పాటు వారి సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఆత్మీయ వాతావరణం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తి, సంప్రదాయం, ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం... ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఆత్మీయ సమావేశంగా నిలిచింది.