ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలకు గ్రీన్ సిగ్నల్
ఫలించిన మంత్రి తుమ్మల కృషి
• దేవరపల్లి రహదారిపై ప్రయాణించిన మంత్రి తుమ్మల
• నితిన్ గడ్కరీ అనుమతితో సాకారమైన ప్రాజెక్టు
• రూ.3,573 కోట్లతో నిర్మాణం పూర్తి
• హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగాల్కు నేరుగా అనుసంధానం
• ప్రయాణ సమయం సగానికి తగ్గింపు... ఆరు గంటల నుంచి రెండున్నర గంటలకు
• రైతులు, స్థానికులకు ఉపాధి, రవాణా వరం
• 2017 నుంచి మంత్రి తుమ్మల నిరంతర పర్యవేక్షణ
ఖమ్మం, ఆగస్టు 2:
తెలుగు రాష్ట్రాల ప్రజలు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైటెక్ హైవేపై రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా దేవరపల్లి రహదారిపై ప్రయాణించి పరిస్థితిని పరిశీలించారు. తెలంగాణ తొలి రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి తుమ్మల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. మంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 1న అధికారులు రాకపోకలకు అనుమతించగా, అనధికారికంగానే ప్రజల రాకపోకలు కొనసాగడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఈ రహదారిపై ప్రయాణించడం విశేషం.
2017 నుంచి నిరంతర పర్యవేక్షణ
కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకు అనుమతి మంజూరు చేయగా, అప్పటి కేంద్ర రహదారుల కార్యదర్శి గిరిధర్ (ఐఏఎస్) సహకారంతో 2017లోనే డీపీఆర్ సిద్ధం చేయించి, 2018 నాటికే భూసేకరణ పూర్తి చేయించడం ద్వారా మంత్రి తుమ్మల ఈ ప్రాజెక్టుకు వేగం అందించారు. టెండర్ల దశ నుంచి పనుల పూర్తి వరకూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ధ్వంసలాపురం, కల్లూరు, వేంసూర్ వంటి కీలక ప్రాంతాల్లో కొత్త ఎగ్జిట్ పాయింట్ల మంజూరుపై ప్రత్యేకంగా కృషి చేసి సాధించారు. దీనిపై స్థానికులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
రూ.3,573 కోట్లతో 165 కి.మీ. నిర్మాణం
భారత్మాల ఎకనామిక్ కారిడార్ పథకం కింద నిర్మించిన ఈ రహదారి తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద ప్రారంభమై, ఏపీలోని రాజమండ్రి సమీపంలోని దేవరపల్లి వద్ద (జాతీయ రహదారి-16పై) ముగుస్తుంది. మొత్తం 165 కిలోమీటర్ల పొడవులో తెలంగాణలో 90 కి.మీ., ఏపీలో 75 కి.మీ. మేర ఇది విస్తరించి ఉంది.
ఈ మార్గం అందుబాటులోకి రావడంతో హైదరాబాద్-రాజమండ్రి-విశాఖపట్నం మధ్య ప్రయాణికులు విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. తద్వారా సుమారు 56 కిలోమీటర్లు, సూర్యాపేట నుంచి చూస్తే దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఆదా అవుతుంది. గతంలో సూర్యాపేట నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకోవాలంటే 4-6 గంటలు పట్టేది కాగా, కొత్త హైవేతో కేవలం రెండున్నర గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఈ కారిడార్ ద్వారా ఏపీలోని ఏడు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగాల్, కలకత్తా వరకూ నేరుగా అనుసంధానం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లోనే తొలి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే
ఈ రహదారి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవేగా ప్రత్యేకత సంతరించుకుంది. నిర్ణీత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే ప్రవేశం కల్పిస్తూ, ప్రతి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేశారు. ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేసే 'క్లోజ్డ్ టోలింగ్ సిస్టం'ను అందుబాటులోకి తెచ్చారు.
భద్రత కోణంలో ఐదు చోట్ల అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఏటీఎంఎస్), ప్రతి 2 కిలోమీటర్లకు 360 డిగ్రీల సీసీ కెమెరాలు, సోలార్ దీపాలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఎమర్జెన్సీ ఓపెనింగ్లు ఏర్పాటు చేశారు. అతివేగం, సీట్బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలను ఏఐ కెమెరాలు గుర్తించి నేరుగా చలాన్లు జారీ చేస్తాయి. ప్రతి 50 కిలోమీటర్లకు 5 ఎకరాల విస్తీర్ణంలో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్ల వంటి సదుపాయాలు కల్పించారు. క్యూఆర్ కోడ్ ద్వారా సమీప పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్ వివరాలు తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది.
రైతులకు, స్థానికులకు వరం
పచ్చని పంట పొలాల మధ్య నుంచి సాగే ఈ రహదారి ప్రయాణికులకే కాక రైతులు, స్థానికులకు కూడా ఎంతో ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు వెంబడి ఉన్న ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సౌలభ్యం, అనుబంధ పరిశ్రమల అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2017లో ప్రతిపాదన రూపొందిన ఈ ప్రాజెక్టు అన్ని అడ్డంకులను అధిగమించి నేడు పూర్తిస్థాయిలో సాకారమైంది. ఈ హైవే అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం, వ్యయం ఆదా కావడమే కాక, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్థిక, రవాణా బంధాలు మరింత బలోపేతం కానున్నాయని అధికారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
"నా ప్రయత్నాలు ఫలించాయి" - మంత్రి తుమ్మల
ఈ ప్రాజెక్టు కోసం తాను వేసిన ప్రతి అడుగూ ఫలించిందని, దశాబ్ద కాలంగా పడిన శ్రమ ఈ రోజు కళ్లెదుటే సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేవరపల్లి రహదారిపై స్వయంగా ప్రయాణించి పరిస్థితులను పరిశీలించిన ఆయన, తాను మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా విజయవంతంగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని, ఇది కేవలం ఒక రహదారి కాదని, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య శాశ్వత అనుబంధానికి వారధి అని వ్యాఖ్యానించారు.