కృష్ణమ్మ పరవళ్లకు 59 వసంతాలు
ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్..
కుడి,ఎడమ కాలువలకు జలవిడుదల జరిగి నేటికి 59 ఏళ్లు
1967 ఆగస్టు 4న ఇందిరాగాంధీ చేతుల మీదుగా కాలువలకు నీటి విడుదల
నాగార్జునసాగర్, ఆగస్టు 4:
కృష్ణా నదిపై నిర్మించిన బహుళార్థసాధక ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన నాగార్జునసాగర్కు నేటితో ఒక చారిత్రక మైలురాయి పూర్తవుతోంది. 1967 ఆగస్టు 4న నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా కుడి, ఎడమ కాలువలకు జలవిడుదల జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్ట, ప్రాంత చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా నాగార్జునసాగర్గా పేరుగాంచి,'ఆధునిక దేవాలయం'గా కీర్తి పొందింది.
నందికొండ నుంచి నాగార్జునసాగర్గా...
నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని నందికొండ గ్రామం ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్గా ప్రసిద్ధి చెందింది. ఆనకట్టకు ఇరువైపులా దక్షిణ విజయపురి (గుంటూరు జిల్లా), ఉత్తర విజయపురిలో భాగంగా పైలాన్, హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) విస్తరించి ఉన్నాయి. శాతవాహనుల కాలం నాటి శ్రీ పర్వతమే నేటి నాగార్జునకొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. జలాశయ నిర్మాణ సమయంలో లభించిన చారిత్రక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలోని నాగార్జునకొండ ప్రదర్శనశాలలో భద్రపరిచారు.
ముక్త్యాల రాజా చొరవతో సాకారం
ఈ జలాశయ నిర్మాణ ఆలోచన 1903లోనే నైజాం పరిపాలన కాలంలో మొదలైంది. అయితే, దీన్ని సాకారం చేయడంలో ముక్త్యాల రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ కృషి కీలకపాత్ర పోషించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నీటిని తమిళ ప్రాంతానికి తరలించే యోచనలో ఉన్న తరుణంలో, ఆయన ఆంధ్ర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాల్లో దాదాపు 38 వేల మైళ్లు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి మద్దతుగా సంతకాలు సేకరించారు. సొంత ఖర్చుతో సర్వేలు, ప్రణాళికలు రూపొందించి, ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నిరంతరం శ్రమించారు.
1952లో నందికొండను సందర్శించిన ఖోస్లా కమిటీ, ప్రాజెక్టు నిర్మాణానికి ఇంతకన్నా అనువైన ప్రాంతం ఉండదని తేల్చి చెప్పింది. చివరకు 1954లో నిర్మాణానికి ఆమోదముద్ర లభించగా, 1955 డిసెంబరు 10న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమానికి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సి.ఎం.త్రివేది హాజరయ్యారు. నిర్మాణ సమయంలో ముక్త్యాల రాజా రూ.52 లక్షలను మ్యాచింగ్ గ్రాంటుగా అందించారు. డ్యామ్ నిర్మాణం 1969లో, క్రెస్టు గేట్ల ఏర్పాటు 1974లో పూర్తయింది.
ప్రాజెక్టు విశేషాలు
డ్యామ్ మొత్తం పొడవు: 15,956 అడుగులు (4,863.39 మీ.)
ప్రధాన రాతి ఆనకట్ట పొడవు: 4,756 అడుగులు
మొత్తం క్రెస్టుగేట్ల సంఖ్య: 26
కుడి కాలువ (జవహర్ కాలువ) పొడవు: 203 కి.మీ. — గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు
ఎడమ కాలువ (లాల్ బహదూర్ కాలువ) పొడవు: 179 కి.మీ. — నల్గొండ, కృష్ణా, ఖమ్మం జిల్లాలకు సాగునీరు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 408 టీఎంసీలు
మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం: 960 మెగావాట్లు (మూడు కేంద్రాల ద్వారా)
మొత్తం ఆయకట్టు: 5 జిల్లాల్లో 22,35,910 ఎకరాలు
స్వర్ణోత్సవాలు, స్మారక నిర్మాణాలు
శంకుస్థాపనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2005 డిసెంబరు 10న స్వర్ణోత్సవాలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రూ.3 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి, ఆయకట్టు అంతటికీ నీరందిస్తామని ప్రకటించారు. నిర్మాణ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల స్మారకార్థం నిర్మించిన స్థూపాన్ని, అలాగే గౌతమ బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కె.ఎల్.రావు, తొలి చీఫ్ ఇంజినీర్ జాఫర్ అలీ విగ్రహాలను వైఎస్ ఆవిష్కరించారు.
ఏడు దశాబ్దాలుగా తెలుగు రాష్టాల్రలో వ్యవసాయానికి, తాగునీటికి, విద్యుత్కు ఆధారంగా నిలిచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు, నేటికీ లక్షలాది రైతు కుటుంబాలకు జీవనాధారంగా కొనసాగుతోంది.