తెలుగుజాతి గర్వించేలా అమరావతి
మంత్రులు అనగాని, సవిత
1 / 2
అమరావతి: తెలుగు జాతి గర్వించేలా రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని, 2028 ఆగస్టు నాటికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత తెలిపారు. అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ ఆనాడు అమరావతి గ్రాఫిక్స్ అని తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుందని విమర్శించారు. గ్రాఫిక్స్కు, వాస్తవాలకు మధ్య తేడా జగన్కు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ విధ్వంసపు క్రెడిట్ ఎవ్వరికీ అక్కర్లేదని, తమ ప్రభుత్వానికి అభివృద్ధి క్రెడిట్ అని స్పష్టం చేశారు. చదువు గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న మంత్రి నారా లోకేశ్తో ఆయనకేమిటి పోలిక అని ఎద్దేవా చేశారు.
రాజధాని అమరావతి పనులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, ఎస్.సవిత మంగళవారం పరిశీలించారు. తొలుత మంత్రుల నివాసాలను, తర్వాత సచివాలయం, హెచ్ఓడీ ఐకానిక్ టవర్లను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల టవర్లను పరిశీలించారు. ఇప్పటికే పూర్తయిన మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ అమరావతిలో గ్రాఫిక్స్ నిర్మాణాలంటూ తప్పుడు ప్రచారాలు చేసిందని ఆరోపించారు. మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకు, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నందుకు మంత్రి నారా లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలో వైసీపీ చెప్పాలని నిలదీశారు.
2028 నాటికి అమరావతి సిద్ధం : మంత్రి సవిత
తెలుగు జాతి గర్వించేలా అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు. సచివాలయం, హెచ్ఓడీ టవర్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు అద్భుతంగా నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ నివాసాలు పూర్తయ్యాయని, ఈ నెల 15న జీఏడీకి అప్పగించనున్నట్టు తెలిపారు. 2028 నాటికి సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ తదితర ఐకానిక్ భవనాల నిర్మాణాలు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాజధాని పనుల్లో కీలకమైన రహదారుల నిర్మాణం చురుగ్గా సాగుతోందని, ప్రజలకు అన్ని సేవలు ఒకేచోట లభించేలా సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. గతంలో హైటెక్ సిటీ సైబరాబాద్ను నిర్మించిన సీఎం చంద్రబాబు అమరావతిని కూడా పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి సవిత కొనియాడారు.
జగన్ది విధ్వంసం... మాది అభివృద్ధి...
ప్రపంచం మెచ్చేలా గ్రీన్ఫీల్డ్ రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మిస్తుండటం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. విధ్వంసం, దోపిడీ, అరాచకం ఇవి జగన్ క్రెడిట్ అని, అభివృద్ధి క్రెడిట్ తమ ప్రభుత్వానిదని అన్నారు. ఆ క్రెడిట్ను ఎవ్వరూ కోరుకోరని, ప్రజలు తిరస్కరించడంతో ఇప్పుడు మావిచగన్ అంటూ మరో డ్రామా ఆడుతున్నారని, మావిచగన్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని జగన్ అని విమర్శించారు. నిరసనల పేరుతో రాష్ట్రంలో జగన్, వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.