సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలి
వైఎస్ జగన్
1 / 2
విజయవాడ,జూన్ 18: కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురైన గాదె సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ కేసులో కృష్ణలంక సీఐతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్, రాష్ట్ర డీజీపీ పాత్రపై కూడా విచారణ జరగాలని ఆయన అన్నారు. మే నెలలో కృష్ణలంక సీఐ వేధింపులతో క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను గుర్తు చేసిన జగన్, సాయికృష్ణను మే 9న పోలీసులు అదుపులోకి తీసుకెళ్లినప్పటి నుంచి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆరోపించారు.
సాయికృష్ణ మరణానికి బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.