రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం
సీఎం చంద్రబాబు
అమరావతి,జూన్18: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన 18వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో రూ.30,515 కోట్ల పెట్టుబడులతో 50 కంపెనీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 29,677 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఇథనాల్, సెమీ కండక్టర్లు, మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీ, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, క్వాంటం టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. పారిశ్రామిక ప్రాంతాల వద్ద అందుబాటు ధరల్లో గృహనిర్మాణాలు చేపట్టాలని, పరిశ్రమలకు అనుమతులు ఆటోమేషన్ విధానంలో మంజూరు చేసే వ్యవస్థను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేసిన తర్వాతే ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.