రాష్ట్రంలో 14 పీఏసీఎస్లకు పీఐసీ కమిటీలు
మంత్రి తుమ్మల
హైదరాబాద్,జూలై 2:రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్ (పీఐసీ) కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం ఈ కమిటీలు ఆరు నెలలపాటు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, ఏది ముందైతే అది వర్తించే విధంగా కొనసాగనున్నాయని మంత్రి వెల్లడించారు.
నివేదికలో వెల్లడైన లోపాలు...
సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్ ఆయా సంఘాల పనితీరుపై సమగ్ర పరిశీలన నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇందులో పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి:
రుణాల వసూళ్లలో తీవ్ర జాప్యం..
ఎగవేతదారుల (డిఫాల్టర్ల) జాబితా తయారు చేయకపోవడం
బకాయిల వసూళ్లకు చర్యలు చేపట్టకపోవడం
ఆడిట్ అభ్యంతరాలను సరిదిద్దకపోవడం
నిర్వహణ కమిటీ సభ్యులు సమావేశాలకు గైర్హాజరు
పరిపాలనా లోపాలు, సంఘాల ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహారం
ప్రస్తుత కమిటీలు ఇదే తీరులో కొనసాగితే సహకార రుణ వ్యవస్థ లక్ష్యాల అమలు దెబ్బతింటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ నేపథ్యంలో నిర్ణయం...
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ (రీఆర్గనైజేషన్) ప్రక్రియ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇది పూర్తయ్యేలోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీతోపాటు ఇతర సహకార సేవలు నిరాటంకంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ కమిటీల నియామకం అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏయే సంఘాలకు కమిటీలు?...
కరీంనగర్ జిల్లాలో మానకొండూరు, తాడికల్, మెట్పల్లి పీఏసీఎస్లు; వరంగల్ జిల్లాలో అమీనాబాద్, ఖానాపూర్, మహ్మదాపూర్, మందపల్లి, సూరిపల్లి, రెడ్లవాడ, చెన్నారావుపేట, గురిజాల, నర్సంపేట పీఏసీఎస్లు; వికారాబాద్ జిల్లాలో కుల్కచర్ల, పరిగి పీఏసీఎస్లకు ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పీఐసీ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కమిటీలు వెంటనే బాధ్యతలు స్వీకరించి ఆయా సహకార సంఘాల నిర్వహణను పర్యవేక్షించనున్నాయని మంత్రి తెలిపారు. ఉత్తర్వుల అమలుకు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్ & రిజిస్ట్రార్ను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.