రామోజీరావు వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళి
Ramoji
అమరావతి: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ డాక్టర్ చెరుకూరి రామోజీరావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. స్వయంకృషితో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగుజాతికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన దార్శనికుడిగా రామోజీరావు నిలిచారని ఆయన పేర్కొన్నారు.
పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకుడిగా, సినీ నిర్మాతగా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన మహనీయుడని లోకేష్ కొనియాడారు. ముఖ్యంగా ఈనాడు పత్రిక ద్వారా ప్రజల జీవితాల్లో చైతన్య వెలుగులు నింపి సామాజిక మార్పుకు విశేషంగా దోహదపడ్డారని తెలిపారు.
తెలుగు మీడియా, పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న మంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన వర్ధంతి సందర్భంగా సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. రామోజీరావు చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని లోకేష్ అన్నారు.