భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్
షెడ్యూల్ విడుదల
ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు సర్వీసులు
హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ నుంచి రోజువారీ కనెక్టివిటీ
భోగాపురం:
ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వచ్చే నెల 17 నుంచి విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా సంస్థ అక్టోబర్ 24వ తేదీ వరకు తన విమానాల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది.
కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఈ విమానాశ్రయం నుంచి ప్రధాన నగరాలకు నిత్యం సర్వీసులు నడపనున్నట్లు సంస్థ వెల్లడించింది. హైదరాబాద్-భోగాపురం మార్గంలో రోజుకు ఐదు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులతో పాటు, ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మూడో సర్వీసును కూడా నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అలాగే విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు నాలుగు సర్వీసులు ఉంటాయని సంస్థ తెలిపింది.
కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు దేశీయ ప్రధాన నగరాలతో నేరుగా విమాన సదుపాయం లభించనుంది.