కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకం కింద కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలు పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని, పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఎక్స్టెన్షన్ అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు.
గురువారం హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఆవరణలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రికి రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. తెలంగాణలో ప్రస్తుత ఎల్ నినో ప్రభావం, తక్షణ కార్యాచరణ ప్రణాళికపై కమిటీ కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడిందని, గ్రామాలవారీగా అత్యవసర ప్రణాళికలు రూపొందించి పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల పంటల వైపు రైతులను మళ్లించాలని నివేదిక పేర్కొంది. వీటికి సంబంధించి 75 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.
గత సీజన్లో 79.49 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి 74.56 లక్షల ఎకరాలకే పరిమితమైనట్లు నివేదిక వెల్లడించింది. ప్రధానంగా పత్తి 45 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాలు, వరి 14.92 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు తెలిపింది. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో 75 నుంచి 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్ సాగు పద్ధతులను ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. అలాగే పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై అందించి పశుగ్రాస సాగును ప్రోత్సహించాలని, సాగునీటి కోసం నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని పేర్కొంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాంకేతిక సూచనలు అందించాలని, హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ రైతుబజార్లకు రవాణా సౌకర్యం కల్పించాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించాలని, అత్యవసర చర్యల అమలును పర్యవేక్షించేందుకు గ్రామస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.