వర్జీనియా పొగాకు రైతులకు న్యాయమైన ధర దక్కేలా చర్యలు
ఆక్షన్ ప్లాట్ఫామ్లపై ప్రత్యేక దృష్టి
అమరావతి,జూలై 6:వర్జీనియా పొగాకు కొనుగోళ్ల అంశంపై వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. టొబాకో బోర్డు చైర్మన్,ఈడీలతో పాటు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి,అనగాని సత్యప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రతినిధి రాక... క్షేత్రస్థాయి పర్యటనలు
ఈ నెల 9న టొబాకో బోర్డు సెంట్రల్ జాయింట్ సెక్రటరీ రాష్ట్రానికి రానున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హై రిజెక్షన్ నమోదవుతున్న వేలం కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే, ఆక్షన్ కేంద్రాలను స్వయంగా సందర్శించాలని సహచర మంత్రులకు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
సిండికేట్పై కొరడా... బకాయిదారులకు వార్నింగ్
పొగాకు కొనుగోళ్లలో కొన్ని కంపెనీలు సిండికేట్గా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలపై క్షేత్రస్థాయిలో లోతుగా విచారణ జరపాలని మంత్రులకు ఆయన సూచించారు. వేలంలో పాల్గొనని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును ఆదేశించారు.
రైతులకు న్యాయం జరిగేలా చర్యలు
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. వేలం ప్రక్రియలో పారదర్శకత పాటించేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.