తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ
మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు
1 / 2
ముంబై: తూర్పు కనుమల్లో పులుల సంరక్షణకు మహారాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్కు రెండు ఆడ పులులను తరలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిగాయి.
జన్యు సమస్యలతో పులుల సంఖ్య తగ్గుదల
తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పులుల సంఖ్య పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
జన్యు వైవిధ్యానికి దోహదం
ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి సమస్యలు అధిగమించడంతో పాటు జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ వివరించారు. దీనివల్ల తూర్పు కనుమల్లో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు
శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయని, ఈ సంయుక్త కార్యచరణ ద్వారా అది ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.