ఉమేష్ చంద్రకు యూనిఫాం అంకితం చేసిన డీజీపీ ప్రతాప్
స్నేహానికి సైకిల్ యాత్రతో నివాళి
అమరావతి,జూన్ 30: పదవీ విరమణ రోజున ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాదిరెడ్డి ప్రతాప్, ఐపీఎస్ అరుదైన నివాళి ఘటనకు తెరతీశారు. మంగళవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం నుంచి బయలుదేరిన ఆయన తెనాలిలో ఉన్న అమర వీరుడు ఉమేష్ చంద్ర, ఐపీఎస్ విగ్రహం వరకు సైకిల్పై యాత్ర చేపట్టారు. విగ్రహం వద్దకు చేరుకున్న ప్రతాప్ మూడు దశాబ్దాలకు పైగా తాను గౌరవంగా ధరించిన పోలీసు యూనిఫాంను అక్కడే అంకితం చేశారు.
ఒకే బ్యాచ్కు చెందిన ప్రతాప్, ఉమేష్ చంద్రలు ఆత్మీయ మిత్రులు. ఉగ్రవాద, నేరశక్తులపై నిర్భయంగా పోరాడుతూ విధి నిర్వహణలో ఉమేష్ చంద్ర అమరుడయ్యారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగం నేటికీ పోలీసు శాఖకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పలువురు అధికారులు పేర్కొన్నారు. మిత్రుడికి నివాళిగా చేపట్టిన ఈ యాత్రలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ప్రతాప్ బాల్యంలో తల్లితో కలిసి పాలు పంపిణీ చేసేవారు. అక్కడి నుంచి రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారిగా ఎదిగిన ఆయన ప్రయాణం క్రమశిక్షణ, నిజాయితీ, నిరాడంబరతలకు నిదర్శనంగా నిలిచింది. పదవీ విరమణకు ముందు తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్వయంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా గురుభక్తిని చాటుకున్నారు.
35 ఏళ్లకు పైగా సాగిన పోలీసు సేవలో ఎస్పీ, గ్రేహౌండ్స్ కమాండర్, సీఎంవో అదనపు కార్యదర్శి, ఏపీ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ, ఏపీఎస్పీఎఫ్ డీజీపీ, ఏపీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ డీజీ, రోడ్డు భద్రత అథారిటీ చైర్మన్ వంటి కీలక బాధ్యతలను ప్రతాప్ విజయవంతంగా నిర్వహించారు. దేశ, విదేశాల్లో విశిష్ట సేవలందించిన ఆయన పదవీ విరమణ సందర్భంగా అమర వీరుడికి యూనిఫాం అంకితం చేయడం స్నేహానికి, త్యాగానికి, పోలీసు సేవా విలువలకు చిరస్మరణీయ నివాళిగా నిలిచింది.