‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకావిష్కరణ
@సింగపూర్
సింగపూర్ 16: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవిత ప్రయాణం, నాయకత్వ లక్షణాలు, పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలను విశ్లేషిస్తూ రచించిన ‘సీబీఎన్@361 డిగ్రీస్ – పాలీమ్యాథ్’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సింగపూర్లో మంగళవారం ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పుస్తకాన్ని విడుదల చేసి, తొలి ప్రతులను సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి. నారాయణ, అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు.
ఈ పుస్తకాన్ని ‘రేపటి కోసం’ దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలో అనువదించారు. దార్శనిక నేతగా చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి దిశగా ఆయన రూపొందించిన విజన్లు, అమరావతి నిర్మాణంపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ వంటి అంశాలను పుస్తకంలో విశ్లేషించినట్లు రచయిత తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ వ్యవస్థాపక నాయకుడు లీ క్వాన్ యూ, న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిందా ఆర్డెర్న్ తరహాలోనే చంద్రబాబు నిర్ణయాలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో సాగుతున్నాయని పుస్తకంలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఏపీ రెరా మాజీ చైర్మన్ రామనాథ్ వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పాటు, ప్రజలకు పెద్దగా తెలియని పలు విశేషాలను కూడా ఇందులో పొందుపరిచినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా లీ క్వాన్ యూ శతజయంతి సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వెండి నాణేన్ని కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు బహూకరించారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గతంలో వెలువడిన ‘చంద్రబాబు X.0’ పుస్తకం సాఫ్ట్ కాపీకి సుమారు 80 లక్షల డౌన్లోడ్లు లభించాయని, ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకం రాజకీయ విశ్లేషకులు, నాయకత్వ లక్షణాలపై అధ్యయనం చేస్తున్నవారు, మేనేజ్మెంట్ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో రెరా మాజీ చైర్మన్ రామనాథ్, కేవీ సత్యనారాయణ, శంకర ప్రసాద్తో పాటు సింగపూర్లోని తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.