కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ విద్య
సీఎం రేవంత్
ఆరుట్ల(రంగారెడ్డి జిల్లా):ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చి, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా నిలిచిన ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) రేపు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రాష్ట్ర విద్యారంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు, భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు నమూనాగా నిలవనుంది.
ఉదయం 9.30 గంటలకు ఆరుట్లకు చేరుకోనున్న ముఖ్యమంత్రి, పాఠశాల పైలాన్ను ఆవిష్కరించి విద్యా సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం డిజిటల్ క్లాస్రూమ్లు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్లు, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలిస్తారు. విద్యార్థులు, స్కూల్ కమిటీ సభ్యులతో ముఖాముఖి సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన తర్వాత ఆరుట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్లో భాగంగా ఆరుట్లలో నిర్మించిన ఈ విద్యా సంస్థను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్పర్సన్ ఆకునూరి మురళి ప్రత్యేక పర్యవేక్షణలో రూపొందిన ఈ ప్రాజెక్టు విద్యారంగంలో ప్రభుత్వ దృక్పథానికి అద్దం పడుతోంది.
నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్య అందించడంతో పాటు ఆధునిక సాంకేతికత ఆధారిత బోధన, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అన్ని వసతులను కల్పించారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సృజనాత్మక నైపుణ్యాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.
భోజనం నుంచి బస్సు వరకు అన్నీ ఉచితం
విద్యార్థులపై ఆర్థిక భారం లేకుండా విద్యను అందించాలనే లక్ష్యంతో పలు ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. విద్యార్థులకు రవాణా కోసం బస్సు సౌకర్యం, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ను ఉచితంగా అందిస్తున్నారు. దీంతో గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.
పైలట్ ప్రాజెక్టుగా నాలుగు పాఠశాలలు
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ముందు పైలట్ ప్రాజెక్టుగా నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల, మంచాల, నాగర్కర్నూల్ జిల్లాలో వంగూరు, పోల్కంపల్లి ప్రాంతాల్లో ఈ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. వీటి పనితీరు ఆధారంగా దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
1,814 మంది విద్యార్థులతో విద్యా కేంద్రం
ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మొత్తం 1,814 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక విభాగంలో 750 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది ఉన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ సంఖ్యే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది.
విద్యారంగంలో కొత్త అధ్యాయం
ప్రభుత్వ పాఠశాలలను కేవలం బోధనా కేంద్రాలుగా కాకుండా సమగ్ర అభ్యాస వేదికలుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనకు ఆరుట్ల టీపీఎస్ నాంది పలుకుతోంది. కార్పొరేట్ విద్యకు సమానమైన వాతావరణాన్ని ప్రభుత్వ రంగంలోనే కల్పించడం ద్వారా సామాన్య కుటుంబాల పిల్లలకు ప్రపంచ స్థాయి అవకాశాలు అందించాలన్న లక్ష్యానికి ఈ పాఠశాల మార్గదర్శకంగా నిలవనుంది. రేపటి సీఎం పర్యటనతో ఆరుట్ల మాత్రమే కాదు, తెలంగాణ విద్యారంగం కూడా కొత్త దిశగా అడుగులు వేయనుంది.