జెన్జీని గందరగోళపరిచే శక్తులపై అప్రమత్తంగా ఉండాలి
పవన్ కల్యాణ్
న్యూఢిల్లీ:ఫ్యాషన్ పేర్లు, ఆకర్షణీయ నినాదాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న ఫ్యాన్సీ సిద్ధాంతాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఏ అంశంపైనా అభిప్రాయం ఏర్పరుచుకునే ముందు చదవడం, తెలుసుకోవడం, పరిశోధించడం, పరిశీలించడం అవసరమని పేర్కొన్నారు. దేశ సమగ్రత, భద్రత, సార్వభౌమాధికారం, శ్రేయస్సు ప్రతి భారతీయుడి తొలి ప్రాధాన్యంగా ఉండాలని అన్నారు.
ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’ సమావేశం ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రతి తరంలోనూ సమాజంలో జరిగే పరిణామాలపై యువతలో ఆవేదన, ఆగ్రహం, ప్రశ్నించే తత్వం సహజమని, అయితే ఆ భావాలకు దేశభక్తిని జోడించి సానుకూల దిశగా మలచుకోవాలని సూచించారు.
మోదీ బలమైన దేశభక్తి నాయకుడు
2008 ముంబయి ఉగ్రదాడుల అనంతరం దేశానికి బలమైన నాయకత్వం అవసరమని తాను భావించానని పవన్ కల్యాణ్ తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ఉంచి ప్రపంచ వేదికపై ఉన్నత స్థానంలో నిలిపిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై అత్యధిక కాలం ప్రధానిగా సేవలందిస్తున్న మోదీకి అభినందనలు తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఆయన నాయకత్వానికి జనసేన సంపూర్ణ మద్దతు కొనసాగిస్తుందని చెప్పారు.
సైనికులకు ప్రాంతీయత ఉండదు
దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించే సైనికులు ప్రాంతీయతకు అతీతంగా దేశాన్ని కాపాడుతున్నారని పవన్ అన్నారు. సియాచిన్ వంటి క్లిష్ట ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లు ‘నా ప్రాంతం’ అనే భావన కంటే ‘నా దేశం’ అనే భావనతో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి సైనికుల కుటుంబాలపై ప్రాంతీయ భావజాలం ప్రభావం చూపడం సరైనది కాదన్నారు.
కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు
దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహించే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో జనసేన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. దేశానికి ఒక సిద్ధాంతం, రాష్ట్రాలకు మరో సిద్ధాంతం అనే విధానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
తెలంగాణలో జనసేన పోరాటం
తెలంగాణ ఉద్యమంలో యువత చేసిన త్యాగాలపై తనకు గౌరవం ఉందని పవన్ తెలిపారు. తెలంగాణలో అధికార పదవుల కోసం కాకుండా యువత ఆకాంక్షలు, ఆశయాల కోసం జనసేన పనిచేస్తుందని చెప్పారు. సిద్ధాంతాల కోసం పోరాడటమే జనసేన లక్ష్యమని, పోరాటమే పార్టీకి ఊపిరి అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాపై హెచ్చరిక
సామాజిక మాధ్యమాల్లో యువతను గందరగోళపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని పవన్ హెచ్చరించారు. ఫ్యాషన్గా కనిపించే పేర్లు, ఆకర్షణీయ సిద్ధాంతాలకు ఆకర్షితులై గుడ్డిగా ఎవరినీ అనుసరించవద్దని సూచించారు. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి, స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
చరిత్ర తెలుసుకోవాలి
భగత్సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలని పవన్ సూచించారు. దేశభక్తి, సామాజిక బాధ్యత, తార్కిక ఆలోచనలతో యువత ముందుకు సాగాలని అన్నారు.
‘భారతీయతే గొప్ప బంధం’
భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చేది భారతీయతేనని పవన్ పేర్కొన్నారు. దేశాన్ని ఒక ఇంటిగా భావిస్తే రాష్ట్రాలు ఆ ఇంట్లోని గదుల్లాంటివని వ్యాఖ్యానించారు. ప్రాంతాల కంటే దేశం గొప్పదనే భావన ప్రతి ఒక్కరిలో పెంపొందాలని, ‘మనమంతా భారతీయులమే’ అనే చైతన్యం బలపడాలని పిలుపునిచ్చారు.