రెండేళ్లలో శాంతిభద్రతలకు కొత్త దిశ
హోం అనిత
అమరావతి, జూన్ 16: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాల అరికట్టడం, విపత్తుల నిర్వహణ తదితర రంగాల్లో సమగ్ర సంస్కరణలు చేపట్టి గణనీయమైన ఫలితాలు సాధించిందని రాష్ట్ర హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల భద్రత, చట్టబద్ధ పరిపాలన, సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రయోజనాలకు పరిమితమైన వ్యవస్థలను ప్రజాకేంద్రితంగా పునర్నిర్మించామని చెప్పారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే నిరోధించే వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
14.1 శాతం తగ్గిన నేరాలు
సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా, డిజిటల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా రాష్ట్రంలో మొత్తం నేరాల శాతం 14.1 శాతం మేర తగ్గిందని మంత్రి వెల్లడించారు. శాస్త్రీయ దర్యాప్తు, అంతర్శాఖ సమన్వయంతో నేరస్థులను వేగంగా గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు
మహిళల రక్షణను ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. శక్తి యాప్, ప్రత్యేక భద్రతా విభాగాలు, అత్యవసర స్పందన వ్యవస్థల ద్వారా మహిళలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. శక్తి యాప్ ద్వారా ఇప్పటివరకు 11.15 లక్షలకు పైగా ఎస్ఓఎస్ కాల్స్ అందగా, వాటిపై తక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ ముస్కాన్తో 8,396 మందికి కుటుంబాల చేరువ
తప్పిపోయిన చిన్నారులు, మహిళలు, వృద్ధులను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చేందుకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 8,396 మందిని గుర్తించి కుటుంబాలకు అప్పగించామని మంత్రి వెల్లడించారు. ఇది పోలీసు శాఖ మానవీయ కోణాన్ని ప్రతిబింబించే కార్యక్రమమని పేర్కొన్నారు.
చిన్నారుల రక్షణకు కఠిన చర్యలు
పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రత్యేక దర్యాప్తు బృందాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు, వేగవంతమైన విచారణల ద్వారా నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు 2,293 మంది చిన్నారులకు కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించినట్లు చెప్పారు.
డ్రగ్స్పై ఉక్కుపాదం
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ఈగల్ (EAGLE) ప్రత్యేక బృందం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. 56,674 గంజాయి కేసులు నమోదు చేసి, 2,366 మందిపై చర్యలు తీసుకున్నామని, రూ.4 కోట్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
సైబర్ నేరాలపై సాంకేతిక పోరాటం
డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ వార్ రూమ్లు, 1930 హెల్ప్లైన్, బ్యాంకులు, టెలికాం సంస్థలతో సమన్వయం వంటి చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా రూ.247 కోట్లకు పైగా ప్రజల సొమ్మును మోసగాళ్ల బారిన పడకుండా కాపాడినట్లు వెల్లడించారు.
10 నిమిషాల్లోనే అత్యవసర సేవలు
అత్యవసర పరిస్థితుల్లో స్పందన వ్యవస్థను ఆధునీకరించడం వల్ల గతంలో 30 నిమిషాలుగా ఉన్న సగటు స్పందన సమయం ప్రస్తుతం 10 నిమిషాల లోపుకు తగ్గిందని మంత్రి తెలిపారు. అత్యవసర సేవల్లో 97.47 శాతం స్పందన రేటు నమోదు కావడం విశేషమన్నారు.
పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యం
పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. 6,000 మందికి పైగా పోలీసు నియామకాలు, 505 మంది గెజిటెడ్ అధికారులకు పదోన్నతులు, కానిస్టేబుల్ శిక్షణార్థుల స్టైపెండ్ను రూ.4 వేల నుంచి రూ.7,500కు పెంచడం వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు.
జైళ్లలో పునరావాసానికి పెద్దపీట
జైళ్లను శిక్షా కేంద్రాలుగా కాకుండా పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణ, మానసిక ఆరోగ్య సేవలు, డీ-అడిక్షన్ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
విపత్తు నిర్వహణలో ఆదర్శంగా ఏపీ
విపత్తుల నిర్వహణ వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించామని, 26 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలతో ప్రాణనష్టం తగ్గించే చర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయి 872 మంది అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించినట్లు వెల్లడించారు.
కఠిన శిక్షలతో నేరస్థులకు చెక్
ప్రాసిక్యూషన్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా 279 కీలక కేసుల్లో విజయవంతమైన తీర్పులు సాధించామని, 8 మందికి మరణదండన, 3 మందికి యావజ్జీవ కారాగార శిక్షలు, మరికొందరికి దీర్ఘకాల జైలు శిక్షలు విధింపజేయగలిగామని మంత్రి తెలిపారు.
ప్రజల భద్రత, మహిళల గౌరవం, యువత భవిష్యత్తు, సమాజ శాంతి కోసం రాజీపడకుండా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత సురక్షిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి అనిత స్పష్టం చేశారు.