సాగునీటిపై సమగ్ర ప్రణాళిక ప్రకటించాలి
మాజీ మంత్రి పువ్వాడ
రైతులకు ముందుగానే నీటి లభ్యతపై స్పష్టత ఇవ్వాలి
ఖమ్మం, ఆగస్టు 8:
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగునీటి లభ్యత, వినియోగం, నీటి విడుదలపై రైతులకు ప్రభుత్వం స్పష్టమైన అవగాహన కల్పించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. ఎల్నినో ప్రభావం, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగుకు అవసరమైన నీటి లభ్యతపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని సూచించారు. రైతులు పంటల ఎంపిక, సాగు సమయం తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సాగర్, గోదావరి, మున్నేరు, వైరా, పాలేరు, కిన్నెరసాని తదితర జల వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, నీటి విడుదల సమయం, ఏ ప్రాంతానికి ఎంత నీరు అందుబాటులో ఉంటుందనే వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాలని కోరారు.
నీటి విడుదలకు సంబంధించి ముందస్తు షెడ్యూల్ ప్రకటిస్తే రైతులు సాగును ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.వర్షపాతంలో హెచ్చుతగ్గులు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పువ్వాడ అజయ్కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.