*రెండేళ్ల పాలన ప్రజా విశ్వాసానికి నిదర్శనం*
బాపట్లలో రెండేళ్ల విజయోత్సవ సభలో ఎమ్మెల్యే ఏలూరి
1 / 2
బాపట్ల, జూన్ 19:
ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రంలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం" బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విధ్వంసకర పాలనకు ప్రజలు చరమగీతం పాడి ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని, దీంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రెండేళ్ల కాలంలో ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పాలన సాగిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి వర్గానికీ చేరవేస్తున్నామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల నమ్మకం చెక్కుచెదరలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని, అనేక అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలు మెచ్చేలా సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
గతంలో ఏ రాజకీయ పార్టీకి లభించని స్థాయిలో మెజారిటీని ప్రజలు కూటమి ప్రభుత్వానికి అందించారని, ఆ నమ్మకానికి తగిన విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. సాగునీటి సంఘాలను బలోపేతం చేస్తూ రైతులకు అండగా నిలుస్తూ రాష్ట్రంలో రామరాజ్య పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి తాగునీటి విడుదల షెడ్యూల్ను కూడా ప్రకటించని దుర్మార్గపు పాలన సాగించారని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ రంగ ప్రోత్సాహం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఆయన అన్నారు.