ప్రజల ఆశీస్సులతోనే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా
ఎమ్మెల్యే ఏలూరి
1 / 2
పర్చూరు,జూన్20:ప్రజల ప్రేమాభిమానాలు, పార్టీ కార్యకర్తల అండదండలే తన రాజకీయ జీవితానికి బలమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. నూతలపాడులో శనివారం నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం’ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీస్సులతో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, 2012లో రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి ప్రజలే తనకు ధైర్యం, ఉత్సాహం నింపారని చెప్పారు.
ఎన్టీఆర్ స్ఫూర్తి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావజాలమే తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చాయని పేర్కొన్నారు. గత 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అవినీతి మరక లేకుండా ప్రజా సేవకే అంకితమయ్యానని తెలిపారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో అభివృద్ధికి బ్రేకులు
గత వైసీపీ ప్రభుత్వం అధికార అహంకారంతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రద్దు చేసి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసిందని ఎమ్మెల్యే విమర్శించారు. 2019 నాటికి పర్చూరు నియోజకవర్గానికి రూ.275 కోట్ల విలువైన అభివృద్ధి పనులు తీసుకొచ్చానని, వాటిని రద్దు చేయడంతో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్ పొడిగింపు పనులు నిలిపివేయడం బాధ కలిగించిందన్నారు.
ప్రజాసేవే టీడీపీ ధ్యేయం
తెలుగుదేశం పార్టీ ప్రజలకు సేవ చేయడానికే పనిచేస్తుందని, పెత్తనం చేయడానికి కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం బర్లీ పొగాకు, శనగల కొనుగోళ్ల ద్వారా అండగా నిలిచిందని గుర్తు చేశారు.
సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.19 కోట్ల సాయం
నియోజకవర్గంలో వైద్య సహాయం కోసం ఎదురుచూస్తున్న వందలాది మందికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.19 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించగలిగామని తెలిపారు.
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
అన్నదాత సుఖీభవ పథకం కింద నియోజకవర్గంలోని 37,861 మంది రైతులకు రూ.26.50 కోట్ల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు.
దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు
నియోజకవర్గానికి చెందిన 10 మంది దివ్యాంగులకు త్రీ వీలర్ మోటార్ సైకిళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దివ్యాంగులు స్వావలంబన సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ట్రాక్టర్ల ప్రారంభం.. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో సమకూర్చిన ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే, అనంతరం ప్రకృతి వ్యవసాయ స్టాల్స్ను పరిశీలించారు. రసాయన రహిత సాగుపై రైతులు ఆసక్తి చూపాలని సూచించారు.
మహిళలకు రూ.13 కోట్ల డ్వాక్రా రుణాలు
మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ రూ.13 కోట్ల విలువైన డ్వాక్రా రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు.
కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల సాయం
చిన్నగంజాం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆలహరి సూర్యనారాయణ మృతి చెందడంతో పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.
బస్సు ఎక్కి మహిళలతో ముచ్చట
సభకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే ఏలూరి మహిళలతో మాట్లాడి, ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ షమీమ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, మాల కార్పొరేషన్ చైర్మన్ పి. విజయకుమార్, పారిశ్రామికవేత్త విన్నకోట రవికుమార్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.