కరెన్సీ నోట్ల తరహాలో భద్రతా ఫీచర్లతో కొత్త పాస్పుస్తకాలు
మీ భూమి–మీ హక్కు’ సభలో సీఎం చంద్రబాబు
1 / 3
2027 నాటికి భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి
బ్లాక్చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థ అమలు
ఆచంట: రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనను 2027 నాటికి పూర్తి చేసి ప్రతి రైతు చేతిలో తప్పుల్లేని పట్టాదారు పాస్పుస్తకం ఉండేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో సోమవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో భూ రికార్డులు తీవ్ర గందరగోళానికి గురయ్యాయని విమర్శించారు. ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలిగించేలా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకువచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేసి రైతుల యాజమాన్య హక్కులను కాపాడిందన్నారు. గత పాలకుల నిర్వాకంతో రికార్డుల ప్రక్షాళనకు మూడేళ్ల సమయం అవసరమవుతోందని పేర్కొన్నారు.
భద్రతా ఫీచర్లతో కొత్త పాస్పుస్తకాలు
కరెన్సీ నోట్ల తరహాలో క్యూ ఆర్ కోడ్తో పాటు పలు భద్రతా లక్షణాలను కలిగిన పట్టాదారు పాస్పుస్తకాలను ప్రభుత్వం జారీ చేస్తోందని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా బ్లాక్చైన్ సాంకేతికత ఆధారంగా భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి భూయూనిట్కు ప్రత్యేక బ్లాక్చైన్ ఐడీ కేటాయించడం ద్వారా రికార్డుల మార్పిడి, తారుమారుకు అవకాశం ఉండదన్నారు.
ఇప్పటికే 6,688 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి భూ రికార్డులను నవీకరించామని, 26.46 లక్షల మందికి కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు అందజేశామని తెలిపారు. మరో తొమ్మిది నెలల్లో 10,357 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 67.32 లక్షల పాస్పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
రెవెన్యూ శాఖలో సంస్కరణలు
రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రీ-సర్వే 2.0 కింద 1,836 గ్రామాల్లో తుది ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ పూర్తి చేశామని తెలిపారు. విక్రయం, బహుమతి, విభజన తదితర 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
వారసత్వ హక్కుల బదిలీ ప్రక్రియను సులభతరం చేసి రూ.10 లక్షల లోపు ఆస్తులకు కేవలం రూ.100తో బదిలీ చేసే విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. పాత రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్ చేపట్టామని, ఈ-కేవైసీ పూర్తైన గ్రామాలను వెబ్ల్యాండ్ 2.0లోకి తీసుకువస్తున్నామని వివరించారు. వాట్సాప్ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తు, ట్రాకింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
అక్వా, ఫుడ్ ప్రాసెసింగ్కు ప్రాధాన్యం
గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, అక్వా రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు చెప్పారు. అక్వా జోన్ పరిధిలోని చెరువులకు యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందిస్తున్నామని తెలిపారు. అక్వా ఫీడ్ ధరల పెరుగుదలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు.
రెండేళ్ల పాలనపై సీఎం
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయంతో అమలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు అదనపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. పెన్షన్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఆటోడ్రైవర్లు, మత్స్యకారుల సంక్షేమం వంటి కార్యక్రమాల ద్వారా వివిధ వర్గాలకు మేలు చేస్తున్నామని వివరించారు.
ప్రతిపక్షంపై విమర్శలు
ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీపై ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. భూ రికార్డుల తారుమారులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజల ఆస్తి హక్కులను దెబ్బతీసే చర్యలకు పాల్పడిన వారికి రాష్ట్ర రాజకీయాల్లో నైతిక హక్కు లేదన్నారు. నిరుద్యోగులు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేతలను డిమాండ్ చేశారు.
ఆరోగ్యాంధ్ర – యోగాంధ్ర
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. జూన్ 21న కోటి మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2047 నాటికి సంపన్నమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, అక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ప్రదర్శనలను ముఖ్యమంత్రి సందర్శించి తయారీదారులను అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.