అర్హులైన ప్రతి పేదకూ ఇందిరమ్మ ఇల్లు
మంత్రి పొంగులేటి
1 / 2
కూసుమంచి: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని రాజుపేట, గట్టు సింగారం గ్రామాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల మంజూరుతో బాధ్యత పూర్తికాదని, నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేస్తున్నామని వివరించారు. ప్రజలకు గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
రాజుపేట గ్రామంలో వనాపురం సుభద్ర, దాసరి భద్రయ్య, కోట వీరారెడ్డి, సండ్ర ఎల్లమ్మ, గట్టు సింగారం గ్రామంలో గుంటి దుర్గా, గుడిపల్లి వెంకట నరసమ్మ, దివ్వల రమేష్, గుడిపల్లి జ్యోతి నిర్మించుకున్న ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజుపేట గ్రామంలో మంజూరైన ఇళ్లలో నాలుగు పూర్తయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. గట్టు సింగారం గ్రామంలో 19 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటికే 10 ఇళ్లు పూర్తై గృహప్రవేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మరో 2 వేల మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అర్హులైన చివరి లబ్ధిదారుడికి కూడా ఇల్లు అందే వరకు దశలవారీగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కొత్తగా ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశం చేసిన కుటుంబాలు సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.