ఏఐ రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ
ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్,జూలై 7:కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాలకు తెలంగాణ కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కాకుండా, పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక ప్రయోజనాలను జోడించి రాష్ట్రం 'ఏఐ ప్రమాణాలకు దిక్సూచి'గా నిలుస్తోందని చెప్పారు.
నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా 'ది మెరీడియన్ కలెక్టివ్' ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరుగనున్న 'గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమ్మిట్ - ది హైదరాబాద్ కలెక్టివ్' కార్యక్రమాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఏఐ వెనుక వనరుల భాగస్వామ్యం
ఏఐ అంటే కేవలం క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లు మాత్రమే కాదని, దాని వెనుక విద్యుత్, నీరు, భూమి, మానవ వనరుల భాగస్వామ్యం ఉంటుందని ప్రభుత్వం గుర్తించిందని భట్టి వివరించారు. ఏఐని వద్దని తాము అనడం లేదని, అది ఎలా ఉండాలో ప్రపంచానికి చూపిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను, ముఖ్యంగా నీటిని, విద్యుత్తును హరించే రీతిలో ఏఐని నిర్మించడం కాకుండా, పునరుత్పాదక ఇంధనం, బాధ్యతాయుత వనరుల నిర్వహణతో తెలంగాణ ఏఐకి కేరాఫ్ అడ్రస్గా మారుతోందని పేర్కొన్నారు.
స్థానిక నైపుణ్యాలకు ప్రాధాన్యం
పెట్టుబడులను ఆహ్వానించడంలో రాష్ట్రం చురుగ్గా ఉన్నా, అవి పర్యావరణానికి, స్థానిక ప్రజలకు మేలు చేసేలా ఉండాలని ఉప ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. కేవలం భూమి, నీరు, విద్యుత్తు ఇచ్చి చేతులు దులుపుకునే పద్ధతికి బదులు, పరిశ్రమలు స్థానిక నైపుణ్యాలను పెంపొందించాలని, స్వచ్ఛమైన ఇంధనాన్ని వినియోగించాలని, రీసైకిల్ చేసిన నీటిని మాత్రమే వాడాలని కోరారు. ఇది ఇంజనీరింగ్ మెరుగుదల మాత్రమే కాదని, రాష్ట్ర విలువలకు నిదర్శనమని అభివర్ణించారు.
కార్బన్ క్రెడిట్స్పై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతున్న తరుణంలో, తెలంగాణ 'పీపుల్స్ క్రెడిట్' అనే నూతన భావనను తెరపైకి తెచ్చిందని వెల్లడించారు. ఏఐ పెట్టుబడులు కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా, స్థానిక ఉపాధి కల్పన, గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.
రైతులు, సామాన్యులకు భరోసా
వ్యవసాయానికి, సామాన్య ప్రజలకు దక్కాల్సిన నీటి వనరులతో సాంకేతికత ఎన్నడూ పోటీ పడకూడదని భట్టి నొక్కిచెప్పారు. నీటి వినియోగంలో అత్యంత బాధ్యతాయుతమైన విధానాలు అనుసరించే ఏఐ వ్యవస్థలకే రాష్ట్రం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. భాషాపరమైన అడ్డంకులను తొలగించి, మహబూబాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
నెహ్రూ మొదలు మన్మోహన్సింగ్ వరకు దేశం అనుసరించిన శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి పథాన్ని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో తెలంగాణ మరింత ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం కేవలం డేటా సెంటర్ల కేంద్రంగా మాత్రమే కాక, వాటిని ఎలా నిర్మించాలో ప్రపంచానికి బోధించే 'రోల్ మోడల్'గా నిలుస్తోందని గర్వంగా చెప్పారు.
పారదర్శక పాలన, మానవీయ విలువలతో కూడిన అభివృద్ధి విధానాలు పెట్టుబడిదారులకు గొప్ప భరోసా ఇస్తున్నాయని, ఏఐ మేధస్సుతో పాటు మానవీయ వివేకం కలిగిన సంస్థలే భవిష్యత్తులో ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తాయని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.