చీపురు పట్టిన కేంద్ర మంత్రి...‘స్వచ్ఛ పాఠశాల’కు శ్రీకారం
మోదీ 12 ఏళ్ల పాలనా స్పూర్తితో సిరిసిల్లలో బండి
సిరిసిల్ల:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం రాజకీయ నాయకుడిగా కాకుండా ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యకర్తగా మారి ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమానికి ఆయన స్వయంగా నాంది పలికారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ చీపురు పట్టి తరగతి గదులను ఊడ్చారు. పైపుతో నీళ్లు చల్లి గదులను శుభ్రం చేశారు. బెంచీలు, టేబుళ్ల కింద పేరుకుపోయిన దుమ్మును తొలగిస్తూ విద్యార్థులకు పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు. పాఠశాల ఆవరణను కూడా శుభ్రపరిచారు.
నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
బండి సంజయ్ పిలుపు మేరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బీజేపీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. సొంతంగా చీపుర్లు, బకెట్లు, మగ్గులు, క్లాత్లు తీసుకువచ్చి తరగతి గదులు, ప్రాంగణాలను శుభ్రం చేశారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత సమాజమంతా పంచుకోవాలనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.
‘మన పాఠశాలను మనమే శుభ్రం చేసుకుందాం’
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, మోదీ పాలన 12 ఏళ్ల సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాత్రం ప్రత్యేకంగా ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు త్వరలో గ్రామాలు, మండలాల వారీగా అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ‘టిఫిన్ బైఠక్’ నిర్వహించి ఏ పాఠశాలను ఎవరు శుభ్రం చేయాలనే అంశంపై ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
టెన్త్ విద్యార్థులకు సైకిళ్లు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే తన లక్ష్యమని పేర్కొన్న బండి సంజయ్, ఈ విద్యాసంవత్సరంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని ప్రకటించారు. అలాగే టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజును తన వేతనం నుంచి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను త్వరలో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
సేవా కార్యక్రమానికి విశేష స్పందన
ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత, విద్యా వాతావరణం మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజా ప్రతినిధి స్వయంగా చీపురు పట్టి శుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమం ద్వారా పాఠశాలలపై సమాజ బాధ్యతను పెంపొందించడంలో ఒక మంచి ప్రయత్నంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.