జలధార పనులకు వేగం.. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం
సీఎం చంద్రబాబు
1 / 2
అమరావతి:రాష్ట్రంలో చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమాల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జలధార-జలహారతి పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా పనులు చేపట్టాలని, నిధుల వినియోగంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్లకు సూచించారు. నీటి మిగులు బేసిన్ల నుంచి తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాలకు అనుసంధాన పనులు చేపట్టాలని ఆదేశించారు. చెక్డ్యామ్లు, ఇంకుడు గుంతలు, ఫామ్పాండ్లు, కాంటూర్ కందకాల పునరుద్ధరణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
చిన్న వాగుల అభివృద్ధికి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను పరిశీలించాలని సూచించారు. వర్షపు నీటిని వడిసిపట్టేలా జిల్లాల వారీగా వినూత్న చర్యలు అమలు చేయాలని చెప్పారు. జలధార తొలి విడత పనులు పూర్తయ్యాక చెక్డ్యామ్లు, ఫామ్పాండ్లు, చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నీటి ప్రవాహాలకు ఆటంకం లేకుండా కాలువలు, కరకట్టల్లోని అడ్డంకులను తొలగించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత పెంచాలని సీఎం ఆదేశించారు. జలధార కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలను ఇరిగేషన్, అవేర్ తదితర సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. జిల్లాల వారీగా భూగర్భ జలాల పునరుద్ధరణపై సమగ్ర లెక్కలు సిద్ధం చేయాలని చెప్పారు.
జలధార కార్యక్రమంలో స్థానికులు, రైతులు, నీటి వినియోగదారుల సంఘాలను భాగస్వాములు చేయాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.