బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లు పంచాలి
మళ్లీ బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదు కవిత
కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల నిధులను తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు పంచాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆమె, తాను మళ్లీ బీఆర్ఎస్లో చేరతానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
తన పార్టీపై భయం లేదని చెబుతూనే బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్కు వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశారని, టీఆర్ఎస్ పేరు తనకు దక్కకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తన ప్రజా పోరాటాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలతో బీఆర్ఎస్ చేతులు కలుపుతోందని విమర్శించారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, సభ్యత మరిచి తిడితే సహించేది లేదని హెచ్చరించారు.
కేటీఆర్, హరీశ్ రావులపై ఆరోపణలు
కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు క్విడ్ ప్రొ కో పద్ధతిలో అక్రమ అనుమతులు ఇచ్చారని కవిత ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కీలక పాత్రధారి అయిన హరీశ్ రావుకే బీఆర్ఎస్ మళ్లీ ప్రాధాన్యం ఇస్తోందని, ఇంకా మూడు నెలల మంత్రి పదవి కోరుతున్నారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం నీటిపారుదలపై విమర్శలు
ముఖ్యమంత్రికి నీటిపారుదలపై కనీస అవగాహన లేదని, బీఆర్ఎస్ పట్ల కక్షతో కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయడం లేదని కవిత ఆరోపించారు. అర కిలోమీటర్ రాళ్ల కట్ట నిర్మిస్తే మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసుకోవచ్చని సూచించారు.
సింగరేణి, గనుల అంశం
తాడిచర్ల-2 మైనింగ్ కేటాయింపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజాం కాలంలో సింగరేణికి దక్కిన 17 గనుల్లో మిగిలిన 16 గనులను కూడా షరతులు లేకుండా అప్పగించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి కేంద్రం ఇవ్వాల్సిన రూ.54 వేల కోట్లు ఇవ్వకపోవడం వల్లే సంస్థ ఇబ్బందుల్లో పడిందని, డిపెండెంట్ ఉద్యోగాల కోసం నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. లేదంటే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
రైతు సమస్యలపై ఆగ్రహం
మహబూబ్నగర్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన 90 మంది రైతులపై అక్రమ కేసులు, 9 మంది మహిళలపై రౌడీషీట్లు పెట్టడాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ఖమ్మంలో రైతు సభ నిర్వహించే ముందు ఈ కేసులు, రౌడీషీట్లను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు భరోసా, ధాన్యం బోనస్ వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ఈ సందర్భంగా ఆమె... బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కేటాయించిన భూములపై అధికారంలోకి వచ్చాక సమగ్ర సమీక్ష చేపడతామని ప్రకటించారు.