బాపట్ల జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ గడువులోగా పూర్తి చేయాలి
కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్ల,జూన్ 25:జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్ నుంచి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇంట్లో యజమాని లేదా ఎవరూ లేకుండా డోర్ లాక్ ఉన్న ఇళ్లలో ఎన్యుమరేషన్ ఫారాలను లోపల వేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన వారి విషయంలో పదో తరగతి సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు రాజకీయ పార్టీలకు అతిసన్నిహితంగా ఉండకుండా, ప్రభుత్వ ఉద్యోగులుగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఫారాలు పంపిణీ చేసిన రెండు, మూడు రోజుల్లోనే తిరిగి సేకరించాలని, సెలవు దినాల్లో సాయంత్రం 4 గంటలకే బీఎల్ఓలు ఇళ్లకు వెళ్లాలని, ప్రతి సూపర్వైజర్ పరిధిలో 10 మంది బీఎల్ఓలు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, సర్పంచులు తదితర ప్రముఖుల ఇళ్లకు బీఎల్ఓలు నేటి నుంచే వెళ్లి ఫారాలు అందజేయాలని, డిజిటలైజేషన్ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యలను ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు వెంటనే పరిష్కరించాలని సూచించారు.
అనంతరం రైతన్న వారోత్సవాల్లో భాగంగా ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్లను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని, ఇప్పటివరకు 86% పూర్తయిందని, మిగిలింది 27వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం ఏపీఏఐఎంఎస్ యాప్పై రైతులకు అవగాహన కలిగించాలని, ఎల్ నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యేక సమాచార సంచికను కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారిణితో కలిసి ఆవిష్కరించారు.
సమావేశంలో డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారిణి ఏ.లక్ష్మి, డీఏడీ అన్నపూర్ణ, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, ఎలక్షన్ సెక్షన్ పర్యవేక్షకులు షఫి తదితరులు పాల్గొన్నారు.