అడవి నుంచి అసెంబ్లీ దాకా...సీతక్క ప్రస్థానం
తుపాకి పట్టిన చేతులతోనే ప్రజాసేవ...
1 / 3
నక్సలైట్ నుంచి మంత్రి పీఠం వరకు అంచెలంచెలుగా ఎదిగిన పోరాట యోధురాలు
హైదరాబాద్తె:
తెలంగాణ రాజకీయాల్లో ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రస్థానం ఒక ప్రత్యేక అధ్యాయం. వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతున్న వేళ, క్షేత్రస్థాయి నుంచి తన సొంత కృషితో ఎదిగి, గిరిజన మహిళగా రాష్ట్ర మంత్రి పదవి దాకా చేరుకున్న ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
అడవుల్లో పోరాట జీవితం
రాజకీయాల్లోకి రాకముందు సీతక్క పదిహేనేళ్లకు పైగా జననాట్య మండలి ద్వారా, జనశక్తి సాయుధ పోరాట కార్యకలాపాల్లో మహిళా నక్సలైట్గా, దళం లీడర్గా కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అణగారిన ప్రజల్లో చైతన్యం నింపేందుకు గద్దర్, విమలక్క వంటి వారితో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడారు.
జనజీవన స్రవంతిలోకి... న్యాయవాద విద్య
ఎన్టీఆర్ పిలుపు మేరకు అజ్ఞాత జీవితానికి గుడ్బై చెప్పి ప్రధాన స్రవంతిలో కలిసిన సీతక్క, 2001లో హైదరాబాద్లో న్యాయవాదిగా మారేందుకు ఎల్ఎల్బీ చదివారు. ఈ సమయంలోనే ప్రజా విధానం, పరిపాలనపై ఆసక్తి పెంచుకున్న ఆమె, సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటూ స్థానికంగా ప్రజాదరణ పొందిన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.
తెలుగుదేశం నుంచి రాజకీయ అరంగేట్రం
2004లో తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారి ఎన్నికల బరిలో దిగిన సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఈ ఓటమి ఆమె రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ వేయలేదు. ప్రజల్లో నిరంతరం ఉంటూ, తన సొంత వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ క్రమంగా ఎదిగారు.
కాంగ్రెస్లో కీలక బాధ్యతలు... ఎమ్మెల్యేగా విజయం
పార్టీలో మారుతూ కాంగ్రెస్ గూటికి చేరిన సీతక్క, పార్టీకి చేస్తున్న సేవలు గుర్తించి 2022 డిసెంబరు 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా నియమితులయ్యారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలోనే ములుగు అభ్యర్థిగా స్థానం దక్కించుకున్న సీతక్క, బీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు.
మంత్రి పదవి... ఎల్బీ స్టేడియంలో సందడి
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో 2023 డిసెంబరు 7న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిసెంబరు 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సీతక్కకు, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జ్గా, అనంతరం ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. 2025 జూన్లో నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగానూ నియమితులయ్యారు.
మాస్ లీడర్గా ప్రత్యేక గుర్తింపు
సామాజిక వర్గాల సమీకరణాలు ఎక్కువగా ఉండే తెలంగాణ రాజకీయాల్లో, తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు నిర్మించుకోవడంలో సీతక్క విజయవంతమయ్యారు. వారసత్వ రాజకీయాలకు భిన్నంగా, సాధారణ గిరిజన యువతి నుంచి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన ఆమె తీరు, తెలంగాణ రాజకీయాల్లో ఆమెను ఒక మాస్ లీడర్గా నిలబెట్టింది.
ప్రస్తుతం పంచాయతీరాజ్, మహిళా-శిశు సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతక్క, ప్రభుత్వ కీలక అంశాలపై నిక్కచ్చిగా స్పందిస్తూ, పార్టీలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. అడవుల్లో ఆయుధం పట్టిన చేతులతో అసెంబ్లీలో అభివృద్ధి నినాదం అందుకున్న ఆమె ప్రస్థానం, పోరాటం నుంచి పాలన దాకా సాగిన స్ఫూర్తిదాయక కథగా నిలుస్తోంది.