నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే విద్వేషాలు రగిల్చేలా వైసీపీ వివాదాలు సృష్టిస్తోంది సంక్షేమంలో ప్రజా ప్రభుత్వానికి సాటి లేదు కూటమి వచ్చినప్పటి నుంచి రూ.65,887 కోట్ల మేర పెన్షన్ల పంపిణీ పీఎం సేతు ద్వారా ఏపీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ విశాఖ రైల్వే జోన్ తో రాష్ట్ర ప్రజల కల సాకారం తుని పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
Venkat Kommineni··25 వీక్షణలు
1 / 3
తుని, జూన్ 01:
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలనా యజ్ఞం చేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా ఆటంకం కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్వేషాలు రగిల్చేందుకు అడుగడుగునా వైసీపీ కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతోందని, ఈ అంశాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీఎం, అనంతరం ప్రజా వేదిక సభలో ప్రసంగించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రస్తావిస్తూ వైసీపీ నేతల డ్రామాలను ఎండగట్టారు. ఆ పార్టీ నేతలు ఫ్రస్ట్రేషన్తో ప్రతీ అంశాన్నీ వివాదం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ —
"గత పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రాత్రీపగలూ శ్రమిస్తున్నాం. కానీ వైసీపీ ఇంకా విధ్వంసాన్ని కొనసాగిస్తోంది. సుపరిపాలన చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. వివేకానంద రెడ్డిని హత్య చేసి తొలుత గుండెపోటు అన్నారు; గొడ్డలితో నరికి చంపి డ్రామాలు ఆడారు. 'ఒక్క ఛాన్స్' అని మోసం చేసి కోడికత్తి, గులకరాయి నాటకాలు వేశారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను ప్రజలు తెలుసుకోవాలి. పాలన వైకుంఠపాళి కాకూడదన్నదే మా విజ్ఞప్తి.
గత పాలకులు ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాకే 241 కోర్టు కేసులను పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. గతంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎగ్గొట్టారు; మేం వచ్చాకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అత్యంత పటిష్టంగా టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాం. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఎంపిక జరిగింది. 40 వేల ప్రశ్నలు, 25 రకాల ప్రశ్నాపత్రాలతో ఎక్కడా అక్రమాలు జరగకుండా భర్తీ ప్రక్రియ నిర్వహించాం. ఫ్రస్ట్రేషన్లో ఉన్న వైసీపీ దీనిని కూడా వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసింది. సమాజంలో అశాంతిని రేపేందుకు ప్రయత్నాలు జరిగాయి. జాగ్రత్తగా ఉండబట్టే గట్టిగా సమాధానం ఇవ్వగలిగాం.
పరామర్శలకు వెళ్తూ సొంత కార్యకర్త సింగయ్యను కారు కింద తొక్కి చంపి పొదల్లోకి విసిరేసి పోయారు. కడపకు చెందిన ఒక పాస్టర్ను పంపి హత్యాయత్నం అంటూ డ్రామాలు ఆడి, దానిని మా పార్టీపై నెట్టేందుకు ప్రయత్నించారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదంలో చనిపోతే, దానిని కూడా మాకు అంటగట్టాలని ప్రయత్నాలు జరిగాయి. సీసీ కెమెరాల సాయంతో ఈ కుట్రలను బట్టబయలు చేయగలిగాం.
తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర సాక్షి మీడియా ప్రతినిధులే మద్యం బాటిళ్లను పారేసి అపవిత్రం చేసేందుకు ప్రయత్నించారు. సాక్షాత్తూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నించిన వారిని ఏమనాలి? వారిది వేరే మతం కావొచ్చు — దానికి మేం తప్పు పట్టడం లేదు. కానీ కుట్రలతో హిందూ దేవాలయాలపై దాడులు, అపవిత్రం చేసే ప్రయత్నాలు సరికాదని హెచ్చరిస్తున్నాను.
కడపలో పెద్ద దస్తగిరిని వైసీపీ వారే ఆస్తుల వివాదంలో హత్య చేసి, టీడీపీపై నెట్టేందుకు ప్రయత్నించారు. నంద్యాలలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే. వైసీపీ వాళ్లే ధ్వంసం చేశారు కాబట్టే సాక్షి పత్రికలో ఆ వార్త రాయలేదు. కాకినాడలోనే వైసీపీ ఎమ్మెల్సీ దళితుడైన డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారు; కానీ వైసీపీ ఆ ఎమ్మెల్సీకి సన్మానాలు చేసింది. రాజకీయ పార్టీగా ఈ తప్పిదాలు సరిచేసుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న వారి ఆటలు సాగనీయం" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.