సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష
బకాయిల చెల్లింపుపై స్పష్టత
హైదరాబాద్, జూలై 28: పత్తి విత్తనోత్పత్తికి సంబంధించి సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లకు మధ్య పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణకు దిశానిర్దేశం చేసింది. సచివాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంయుక్తంగా సీడ్ కంపెనీల ప్రతినిధులు, సీడ్ కంపెనీ అసోసియేషన్ సభ్యులు, వివిధ జిల్లాల్లో పత్తి విత్తనోత్పత్తిలో భాగస్వాములైన ఆర్గనైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇటీవల చేసిన విజ్ఞప్తి మేరకు ఈ భేటీ ఏర్పాటైంది. సీడ్ రైతులకు ఆర్గనైజర్ల ద్వారా జరగాల్సిన చెల్లింపులు, అలాగే ఆర్గనైజర్లకు సీడ్ కంపెనీలు చెల్లించాల్సిన బకాయిల అంశంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
పెండింగ్ బకాయిలపై మంత్రి తుమ్మల కంపెనీల ప్రతినిధులను వివరణ కోరగా, గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలన్నింటినీ ఈ ఏడాది ఆగస్టు నెలలోగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల వల్ల కంపెనీల వద్ద విత్తన నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు, ఆర్గనైజర్లకు చెల్లింపులు చేయడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. అవసరమైతే బ్యాంకుల నుంచి మార్ట్గేజ్ రుణాలు తీసుకైనా చెల్లింపులు చేస్తామని, ఆగస్టు నుంచి ప్రారంభించి డిసెంబర్ నెలాఖరులోగా చెల్లింపులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సీడ్ కంపెనీలు గానీ, ఆర్గనైజర్లు గానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిల చెల్లింపులను వెంటనే ప్రారంభించి, రైతులకు సకాలంలో అందేలా కార్యాచరణ చేపట్టాలని కంపెనీలను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడబోదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి, వ్యవసాయశాఖ డైరెక్టర్, సీడ్ కంపెనీ అసోసియేషన్ ప్రతినిధులు, పత్తి విత్తనోత్పత్తి కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.