రైతుల కళ్లల్లో కదలాడే ఆనందమే ఆశీర్వాదం
సీఎం రేవంత్ రెడ్డి
1 / 2
ఖమ్మం, చింతకాని: రాష్ట్రంలోని రైతుల కళ్లల్లో కదలాడే ఆనందమే తమ ప్రజా ప్రభుత్వానికి నిజమైన ఆశీర్వాదమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయాన్ని దండగ కాదు.. పండుగగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో గురువారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో అశేష రైతాంగాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.
గడిచిన తొమ్మిది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 73.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల మేర రైతు భరోసా నిధులు జమ చేసిన సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై రైతు భరోసా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1009.15 కోట్ల నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. అదేవిధంగా రైతులకు ఈ-పట్టాదారు పాసుపుస్తకాలు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, పలువురు రైతులకు స్వయంగా పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
30 నెలల్లో రూ.1.70 లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి
రైతులను రాజుల్లా చూడాలన్న సంకల్పంతోనే గడిచిన 30 నెలల్లో వ్యవసాయ రంగంపై రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సగటున ప్రతి నెలా రూ.5,500 కోట్లు రైతు సంక్షేమానికే వెచ్చిస్తున్నామని వివరించారు. రైతు భరోసా కింద 30 నెలల్లో రూ.36,135 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయగా, వడ్ల కొనుగోళ్ల కోసం రూ.80 వేల కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. మొక్కజొన్న రైతుల కోసం రూ.3,504 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. "ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండవని పెద్దలు చెప్పారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే మా ఆశయం" అని ముఖ్యమంత్రి అన్నారు.
అప్పుల భారంలోనూ సంక్షేమానికి కొదవ లేదు
ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంపై రూ.8.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ, సమయస్ఫూర్తితో పరిపాలన సాగిస్తూ గత ప్రభుత్వ పథకాలతో పాటు అదనపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను కొనసాగిస్తూనే, రైతు భరోసాను ఎకరాకు రూ.12 వేలకు పెంచినట్లు గుర్తుచేశారు.
సంక్షేమ పథకాల వరద
అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు వెయ్యి బస్సులు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60 వేల కోట్ల రుణాలు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. మహిళలకు పండుగ సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడంతో పాటు, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా 67,717 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు తెలిపారు.
2029లో పెరగనున్న స్థానాలు
రాబోయే శాసనసభ ఎన్నికలు 2029 మే, జూన్లో జరుగుతాయని అంచనా వేస్తూ, అప్పటికి రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు, శాసనసభ స్థానాలు 119 నుంచి 182కు పెరుగుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంత్రిమండలి సభ్యులంతా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, రైతులు, విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ఈ సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.