ప్రజల విశ్వాసమే బలం.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం:
సీఎం చంద్రబాబు
1 / 3
తిరుపతి,జూన్ 12:2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును విజయంగా కాకుండా బాధ్యతగా స్వీకరించి పాలన ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రెండేళ్ల పాలనలో ప్రజల్లో ఏర్పడిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని దామినీడులో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ విజయోత్సవ సభలో సీఎం ప్రసంగించారు.
రాష్ట్ర పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నిలబెట్టామని తెలిపారు.
ప్రజల తీర్పు బాధ్యతగా స్వీకరించాం
2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 57 శాతం ఓటు షేర్తో 164 స్థానాలు లభించాయని గుర్తుచేసిన సీఎం, రాష్ట్రాన్ని కాపాడాలన్న సంకల్పంతో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, భారీ అప్పులతో రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు కృషి చేశామని తెలిపారు.
సంక్షేమం–అభివృద్ధి రెండూ సమాంతరంగా
ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో ముందంజలో ఉందని సీఎం పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, పీ-4 వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతోందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యా–వైద్య రంగాల్లో సంజీవని వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.
ఉద్యోగాల భర్తీలోనూ ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోందని, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల భర్తీ చేపట్టినట్లు తెలిపారు. ఉద్యోగుల బకాయిల చెల్లింపులోనూ పురోగతి సాధించామని పేర్కొన్నారు.
పెట్టుబడులకు ఏపీ కేంద్రబిందువు
రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని పునరుద్ధరించామని సీఎం చెప్పారు. పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. రాయలసీమలో డిఫెన్స్, డ్రోన్, స్పేస్ పరిశ్రమలు, తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్, కర్నూలులో బంగారు గని ప్రాజెక్టు వంటి కార్యక్రమాలను ఉదాహరణగా పేర్కొన్నారు.
విశాఖపట్నంలో ఐటీ రంగ విస్తరణ, అమరావతిలో క్వాంటం వ్యాలీ, రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్న ప్రతిపక్షం
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంటే ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తోందని సీఎం విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సానుకూల రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తుంటే, ప్రతిపక్షం విషపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేలు సేవకులే
ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాల్సిందే తప్ప పెత్తందార్లుగా వ్యవహరించకూడదని సీఎం సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ఎమ్మెల్యే బాధ్యత అని చెప్పారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించబోమని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేంద్ర సహకారానికి కృతజ్ఞత
రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని సీఎం పేర్కొన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్ వంటి అంశాల్లో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసిందని అభినందించారు.
లబ్ధిదారుల అనుభవాలు
సభలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ప్రకృతి వ్యవసాయం, తల్లికి వందనం, గృహ నిర్మాణ పథకాల ద్వారా పొందిన ప్రయోజనాలను వివరించారు. రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక వీడియో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.