ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై మంత్రి తుమ్మల ఫోకస్
irrigation
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే కీలక ప్రాజెక్టుల పూర్తిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరగా ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని జలసౌధలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని మంత్రి తుమ్మల సమగ్రంగా ప్రస్తావించారు.
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో సాగునీటి విస్తరణకు కీలకమైన సీతమ్మసాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల పథకంలోని జూలూరుపాడు టన్నెల్, వెంకమ్మ చెరువు వరద ప్రవాహ కాలువ, పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణ, సత్తుపల్లి ట్రంక్ కాలువ భూసేకరణ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సీతమ్మసాగర్కు అనుమతులే ప్రధాన అడ్డంకి
36.57 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మితమవుతున్న సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయని మంత్రి తుమ్మల వివరించారు. అయితే జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 282 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి పనులు తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
జూలూరుపాడు టన్నెల్కు ప్రాధాన్యం
సీతారామ ఎత్తిపోతల పథకంలో కీలక భాగమైన జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే ఇల్లందు, ఖమ్మం, పాలేరు ప్రాంతాలకు గణనీయమైన సాగునీటి ప్రయోజనం కలుగుతుందని మంత్రి వివరించారు. భూసేకరణ, అటవీ శాఖ అనుమతులకు సంబంధించిన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని సూచించారు.
వెంకమ్మ చెరువు కాలువకు రూ.8 కోట్ల అవసరం
2008లో ప్రారంభమైన వెంకమ్మ చెరువు వరద ప్రవాహ కాలువ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో గిరిజన రైతులు, ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 72 ఎకరాల భూమిని రైతులు ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో భూసేకరణ కోసం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాలువ పూర్తయితే ఐదు మైనర్ ఇరిగేషన్ చెరువులు నిండడంతో పాటు పరిసర గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
పెద్దవాగు పునరుద్ధరణకు నిధులపై దృష్టి
గత ఏడాది జూలైలో దెబ్బతిన్న పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కాలేదని మంత్రి ప్రస్తావించారు. ఇందుకు అవసరమైన రూ.3.20 కోట్ల ఆర్థిక అనుమతి ఫైనాన్స్ శాఖ వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయాల్సిన రూ.16 కోట్ల వాటాను త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు.
74 ఎకరాల భూమే లక్ష ఎకరాలకు అడ్డంకి
యాటలకుంట టన్నెల్–సత్తుపల్లి ట్రంక్ కాలువ పనుల్లో భాగంగా నాగుపల్లి గ్రామ పరిధిలో 74 ఎకరాల భూసేకరణ కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల, న్యాయపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. కేవలం 74 ఎకరాల భూమి సేకరణ పూర్తయితే ఈ సాగు సీజన్లోనే లక్ష ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
రెండు నెలల్లో భూసేకరణ పూర్తి
జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేసి సంబంధిత శాఖలకు భూములు అప్పగించాలని మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ పనుల్లో జాప్యానికి తావులేకుండా అధికారులు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సాగునీటి రంగానికి వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకత పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.