రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి: ఎమ్మెల్యే ఏలూరి
ప్రజా సంక్షేమం–అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
పర్చూరు, జూన్ 3: ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేర్చే బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు.
బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్చార్జిలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయించి అనేక పనులు చేపట్టినట్లు తెలిపారు.
గ్రామాలు, పట్టణాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కోసం రూ.100 కోట్లకు పైగా వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అదేవిధంగా ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి కూడా కోట్ల రూపాయల నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు రూ.18 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించి అనేక కుటుంబాలకు అండగా నిలిచినట్లు పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సీజీఎఫ్ కింద రూ.20 కోట్లతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపట్టగా, శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో 24 దేవాలయాల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.
వ్యవసాయ రంగాభివృద్ధికి సాగునీటి వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. వరద కాలువల ఆధునికీకరణకు రూ.100 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, అలాగే రైతులకు సాగునీరు అందించేందుకు రూ.95 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నాయకులకు సూచించిన ఎమ్మెల్యే, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని కోరారు.నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.