ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు
వడ్లు పంపిణీ
ఇంద్రకీలాద్రి,జూన్ 29: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన రైతు భక్త బృందానికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం ఏర్పాటు చేసి, పవిత్ర తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ విశిష్ట కార్యక్రమాన్ని దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్డీపీటీ) మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంస్థ రాష్ట్ర మహిళా కో-ఆర్డినేటర్ కరి రమాసుందరి బృందం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహించింది.
రైతులు విత్తనాలు నాటి నారు తయారు చేసుకునే వ్యవసాయ సీజన్ ప్రారంభ దినమైన ఏరువాక పౌర్ణమి నాడు భూమాతను, పశువులను, గంగమ్మను భక్తితో పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని నిర్వాహకులు తెలిపారు. ఈ సనాతన సంప్రదాయాన్ని కాపాడుతూ, మహిళలు కొన్ని కోట్ల సార్లు చేసిన రామనామ జపంతో పవిత్రీకరించిన వడ్లను శ్రామిక రైతు మహిళలకు దోసెడు చొప్పున పసుపు, కుంకుమతో సౌభాగ్య సత్కారాలతో సమర్పించారు.
పంట విత్తినప్పటి నుంచి, చేతికి వచ్చి ఉత్తమ ఫలితం రైతు మహిళలు పొందే వరకు నిరంతరం రామనామ జపంతోపాటు భూసూక్త, నీలా సూక్త, వరుణసూక్త పారాయణలతో ప్రకృతిని పూజించే వ్రత దీక్షను ఈ సందర్భంగా చేపట్టినట్లు నిర్వాహకులు వివరించారు. ఆహార గింజలను దైవత్వంతో పవిత్రీకరించి రైతులకు అందించడం ద్వారా రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా ప్రతినిధులు, ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో శ్రామిక రైతు మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు.